గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 అక్టోబరు 2019 (06:32 IST)

ఒరిస్సాలో "సైరా"కు కళింగ సేన బ్రేకులు?

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకువచ్చింది. మొత్తం ఐదు భాషల్లో విడుదలైన ఈ చిత్రం... తెలుగు రాష్ట్రాలతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 
 
అయితే, ఈ చిత్రంపై గత కొన్ని రోజులుగా చిత్రంకి సంబంధించి అనేక వివాదాలు చెల‌రేగుతూ వ‌స్తున్నాయి. వీటన్నింటిని అధికమించి ఈ చిత్రం విడుదలైంది. ఇంత‌లోనే సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంటామంటూ ఒడిశాలోని కళింగసేన పార్టీ హెచ్చరించింది.
 
తెల్ల‌దొర‌ల‌కి వ్య‌తిరేకంగా తొలి విప్ల‌వం తెచ్చింది ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. 1846లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తొలి విప్లవం జరిగిందని చెబుతూ సినిమాను తెరకెక్కించారు. కానీ, 200 ఏళ్ల కిందటే అంటే 1817లో ఒడిశాలో తొలి స్వాతంత్య్ర పోరాటం జరిగిందని కళింగసేన వాదిస్తోంది. 
 
చిత్ర ద‌ర్శ‌కుడు త‌ప్పుగా చిత్రీక‌రించి ఒడిశా ప్ర‌తిష్ట‌కి భంగం క‌లిగిస్తున్నారు. ఖుర్ధా ప్రాంతం ప్ర‌జ‌లు ప‌యికొ విప్ల‌వం పేరిట తొలి పోరాటం చేశారు. 2017లో మ‌న రాష్ట్ర‌ప‌తి ప‌యికొ విప్ల‌వంది తొలి విప్లవంగా ప్ర‌క‌టించారు. కానీ, సైరా ద‌ర్శ‌కుడు త‌ప్పుగా చెప్ప‌డం మ‌మ్మ‌ల్ని కించప‌రిచిన‌ట్టుగా ఉంది. ఒడిశాలో సినిమా రిలీజ్‌ని త‌ప్ప‌క అడ్డుకుంటాం అని క‌ళింగ సేన ప్రకటించింది. 
 
ఇందులోభాగంగా, భువనేశ్వర్‌లో 'సైరా' సినిమాను ప్రదర్శించనున్న శ్రీయ థియేటర్‌ వద్ద కళింగసేన పార్టీ సోమవారం నిరసన తెలిపింది. ఆందోళనకారులు అమితాబ్‌బచ్చన్‌, చిరంజీవి దిష్టిబొమ్మలు దహనం చేసి, పోస్టర్లకు నిప్పంటించారు. మ‌రి దీనిపై చిత్ర యూనిట్ స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.