గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 23 సెప్టెంబరు 2019 (13:46 IST)

వదల 'సైరా' నిన్నొదలా... చిరు, చరణ్ లపై ఉయ్యాలవాడ వారసుల ఫిర్యాదు...

చిరంజీవి, చ‌ర‌ణ్‌ల పైన ఉయ్యాల‌వాడ వార‌సులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. సైరా సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ.. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి కుటుంబ స‌భ్యులు చిరు, చ‌ర‌ణ్‌ల పై కామెంట్ చేయ‌డం... చిరు ఇంటి ముందు ధ‌ర్నా చేయ‌డం.. త‌దిత‌ర వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. 
 
తాజాగా మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత రామ్‌చ‌ర‌ణ్‌ల పైన ఉయ్యాల‌వాడ వార‌సులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే.. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తోన్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. అక్టోబ‌ర్ 2న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. 
 
అయితే ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో ఉయ్యాల‌వాడ వార‌సుల‌ను క‌లిసిన సినిమా యూనిట్ వారి కుటుంబంలో 23 మందికి 50 కోట్లు ఇస్తామ‌ని, దానికి ట్యాక్స్ కూడా తామే చెల్లిస్తామ‌ని చెప్పి ఇప్పుడు డ‌బ్బులు ఇవ్వ‌కుండా మోసం చేస్తున్నార‌న్నారు. 
 
ఈ విష‌యాన్ని అడ‌గ‌టానికి చిరంజీవి ఇంటికి వెళితే అక్క‌డ పోలీసుల‌తో అరెస్ట్ చేయించి త‌ప్పుడు కేసులు పెట్టార‌న్నారు ఉయ్యాల‌వాడ వార‌సులు. వార‌సుల‌మైన త‌మ నుండి ఉయ్యాల‌వాడ‌కు సంబంధించిన ఆధారాలు సేక‌రించి ఇప్పుడు త‌మ పైనే త‌ప్పుడు కేసులు పెట్టార‌ని స‌ద‌రు వార‌సులు అంటున్నారు.
 
 ఈ విష‌యాన్ని రామ్‌చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర ప్ర‌స్తావిస్తే.. సుప్రీమ్ కోర్టు తీర్పు ప్ర‌కారం వందేళ్లు దాటిన చ‌రిత్ర‌కారుడి జీవిత చ‌రిత్ర‌ను గౌర‌వ‌ప్ర‌దంగా ఎవ‌రైనా సినిమాగా తెరకెక్కించవ‌చ్చు. 
 
న‌ర‌సింహారెడ్డి గారు ఓ ప్రాంతం కోసం పోరాడిన వ్య‌క్తి. ఆయ‌న ప్రాంతం కోసం నేను ఏదైనా సాయం చేయ‌గ‌ల‌ను కానీ.. ఆయ‌న ఓ కుటుంబానికి ప‌రిమితం చేసి, త‌క్కువ  చేయ‌లేను అన్నారు రామ్‌చ‌ర‌ణ్‌. అయితే... రోజురోజుకు ఈ వివాదాం ముదురుతోంది. మ‌రి... ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుందో..? అనేది ఆస‌క్తిగా మారింది.