శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 అక్టోబరు 2019 (13:10 IST)

దేశమంతా గర్వపడేలా అయోధ్య తీర్పు ఉంటుంది.. హ్యపీ దీపావళి : ప్రధాని మోడీ

దీపావళి పండుగ రోజున ప్రధాని నరేంద్ర మోడీ కోట్లాది మంది దేశ ప్రజలకు తీపికబురు చెప్పారు. అయోధ్యపై దేశమంతా గర్వపడేలా తీర్పు వెలువడుతుందని, అయితే, ఎన్నిరోజులన్న విషయం మాత్రం చెప్పలేనని స్పష్టం చేశారు. 
 
ఆదివారం జాతిని ఉద్దేశించి, ఆల్ ఇండియా రేడియో మాధ్యమంగా 'మన్ కీ బాత్'ను మోడీ వినిపించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలకు దీపావళి సుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండగ, భారత సంస్కృతిలో భాగమన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, తక్కువ కాలుష్యాలు వెదజల్లే టపాకాయలను ఎంచుకోవాలని సూచించారు.
 
ఇకపోతే, అయోధ్య, రామజన్మభూమి వివాదాన్ని మోడీ ప్రసంగంలో ప్రస్తావించారు. 2010, సెప్టెంబరులో ఈ కేసు విషయమై అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చిందని గుర్తు చేశారు. ఆపై సుప్రీంకోర్టులో 9 సంవత్సరాల పాటు వాదనలు జరిగాయని, త్వరలోనే తీర్పు వెలువడుతుందని అన్నారు. 
 
దేశంలోని ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా సుప్రీం తీర్పు ఉంటుందని భావిస్తున్నానని అన్నారు. ఈ తీర్పు ఐదు రోజుల్లో వస్తుందా? ఏడు రోజుల్లో వస్తుందా? పది రోజుల్లో వస్తుందా? చెప్పలేనని, అయితే, తీర్పు కోట్లాది మందికి ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. దేశంలో ఆశ్చర్యపరిచే మార్పును కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు తీర్పు రాజకీయనాయకులు, న్యాయ వ్యవస్థ గర్వపడేలా ఉంటుందన్న నమ్మకం ఉందన్నారు. 
 
ఇదే సమయంలో అక్టోబరు 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అని ప్రజలు మరువరాదని, ఉక్కు మనిషిగా జాతిని ఏకం చేసిన ఘనత ఆయనదేనని వ్యాఖ్యానించారు. ఆయన ఆలోచనలా విధానాలు, ప్రణాళికల కారణంగానే ఇండియా ఇప్పుడిలా ఉందని అభిప్రాయపడ్డారు. భారతావనికి తొలి హోం మంత్రిగా, హైదరాబాద్, జూనాగఢ్ వంటి సంస్థానాలను ఇండియాలో విలీనం చేయించిన ఆయనకు మరోసారి నివాళులు అర్పించి, ఆయన సేవలను గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇదని మోడీ పిలుపనిచ్చారు.