1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (12:11 IST)

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే... పదవీగండం నుంచి గట్టెక్కినట్టేనా?

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు పదవీ గండం పొంచివుంది. అయితే, ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చొరవతో ఠాక్రే ఆ పదవీ గండం నుంచి గట్టెక్కేలా కనిపిస్తున్నారు. అంటే, నిర్ణీత గడువులోగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం తథ్యమయ్యేలా కనిపిస్తోంది. ఇదే జరిగే ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగనున్నారు. 
 
గత ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాలేదు. దీంతో కాంగ్రెస్ - ఎన్సీపీల కూటమి మద్దతుదా శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు స్వీకరించారు. కానీ, ఆయన ఇప్పటివరకు ఏ ఒక్క సభలో సభ్యుడుగా లేరు. భారత రాజ్యాంగం మేరకు ముఖ్యమంత్రి లేదా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆర్నెల్ల లోపు శాసనసభ లేదా శాసనమండలిలలో ఏదో ఒక సభ నుంచ సభ్యుడిగా ఎన్నిక కావాల్సివుంది. 
 
అయితే, ఉద్ధవ్ ఠాక్రే మాత్రం ఇప్పటివరకు ఏ సభకు ఎంపిక కాలేదు. పైగా, ఆయన ఆర్నెల్ల గడువు ఈ నెల 27వ తేదీలోపు ముగియనుంది. ఈలోపు ఆయన కౌన్సిల్‌కు ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఖాళీ అయిన 9 సీట్లకు ఎన్నికలు నిర్వహించాలని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం లేఖ రాశారు. 
 
ఈ నెల 27వ తేదీలోపు సీఎం ఉద్ధవ్ ఠాక్రే కౌన్సిల్‌కు ఎన్నిక కావాల్సి ఉందని గవర్నర్ ఈసీకి గుర్తుచేశారు. గవర్నర్ లేఖపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు పచ్చజెండా ఊపింది. ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే గవర్నర్‌తో ప్రత్యేక సమావేశమై ఇదే అంశంపై చర్చించిన విషయం తెల్సిందే.