శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 జూన్ 2020 (08:12 IST)

సర్వ రోగాలను ధీటుగా ఎదుర్కొనే శక్తి యోగాకు ఉంది : ప్రధాని నరేంద్ర మోడీ

జూన్ 21వ తేదీని ప్రపంచం అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటోంది. దీన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించారు. యోగా ద్వారా అనేక ఇబ్బందులను అధిగమించవచ్చని, రోగాలను ధీటుగా ఎదుర్కొనేందుకు యోగా దోహదపడుతుందని, స్పష్టంగా చెప్పాలంటే సర్వరోగాలకు యోగా ఒక్కటే మందు అని ప్రకటించారు. 
 
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆన్‌లైన్‌ ద్వారా జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు యోగాలో అనేక ఆసనాలున్నాయని చెప్పారు. యోగా మన జీవక్రియను శక్తివంతంగా చేస్తుందని, అందులోని ఆసనాలు మన శరీరాన్ని బలోపేతం చేస్తాయన్నారు. ప్రపంచం యావత్తు యోగాను గుర్తించిందని చెప్పారు. 
 
కరోనా వైరస్‌ మన శ్వాసవ్యవస్థపై త్రీవ ప్రభావం చూపుతుందని, శ్వాస వ్యవస్థను బలోపేతం చేసేందుకు యోగాలో అనేక ఆసనాలున్నాయని గుర్తుచేశారు. అందులో ఒకటి ప్రాణాయామం అని తెలిపిన ఆయన.. అది ఒక రకంగా శ్వాస వ్యాయామం లాంటిదని పేర్కొన్నారు. 
 
మన శ్వాసవ్యస్థ, రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు ప్రాణాయామం ఎంతో మద్దతు ఇస్తుందని, ప్రాణాయామాన్ని రోజువారీ జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా ద్వారా శాంతి, సహనశక్తి, మనోధైర్యం, ఉల్లాసం పెంపొందుతాయని చెప్పారు. 
 
శారీరక దృఢత్వంతోపాటు మానసిక స్థిరత్వం మెరుగుపడుతుందని వెల్లడించారు. కరోనా ఉధృతి దృష్ట్యా సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నామని, అందువల్ల ఇంట్లోనే కుటుంబసభ్యులతో కలిసి యోగా నిర్వహిస్తున్నామని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.