మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ivr
Last Modified: శనివారం, 24 మార్చి 2018 (21:45 IST)

అమిత్ షా అంతే... చంద్రబాబు ఇంతే... హోదా రాదని తేలింది... ఏం చేయాలో చెప్తా... పవన్ కళ్యాణ్

భాజపా అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిస్పందన తర్వాత జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఓ లేఖను ట్విట్టర్లో జోడించారు. దాని సారాంశం... ''బిజెపి జాతీయ అధ్యక్షుడు శ్రీ అమిత్ షా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు న

భాజపా అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిస్పందన తర్వాత జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఓ లేఖను ట్విట్టర్లో జోడించారు. దాని సారాంశం... ''బిజెపి జాతీయ అధ్యక్షుడు శ్రీ అమిత్ షా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి సుదీర్ఘమైన లేఖ రాయడం, దానికి ప్రతిగా శ్రీ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ శాసన సభలో అంతే సుదీర్ఘంగా జవాబు ఇవ్వడం చూస్తుంటే ప్రత్యేక హోదా బీజెపి ఎప్పటికీ ఇవ్వదనీ, దానిని సాధించే స్థితిలో తెలుగుదేశం పార్టీ ఏమాత్రం లేదన్న సంగతి ప్రజలు మరింత అర్థం చేసుకున్నారు. 
 
వేలాది కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చామని, వాటిని ఖర్చు చేయడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైందని పాడిన పాటనే అమిత్ షా మళ్లీ పాడారు. అదే మాదిరిగా ఎప్పటిలానే శ్రీ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం అన్యాయం చేసిందని మరోసారి ఘోషించారు. ఎందుకీ దాగుడుమూతలు? భారత ప్రభుత్వం ఎంత ఇచ్చిందో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో ఇరు ప్రభుత్వాలకు చెందిన అధికారులను కమిటీగా వేసి లెక్కలు కట్టి ప్రజలకు తెలియజేయవచ్చుగా? 
 
జనసేన చొరవతో ఏర్పాటైన జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ అధ్యయనంలో వెల్లడైన అంశాలను పరిగణలోనికి తీసుకుని యూనియన్ గవర్నమెంటును రాష్ట్ర ప్రభుత్వం నిలదీయవచ్చుగా? ఎంతకాలం ఈ ముసుగులో గుద్దులాట? విసిగి వేసారిన ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరవధిక ఆందోళనలకు దిగే పరిస్థితులను దయచేసి కల్పించవద్దని జనసేన పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తోంది. ప్రత్యేక హోదా తప్ప మిగిలిన వాటి గురించి వినే పరిస్థితిలో ప్రజలు లేరనే యదార్థాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తే మంచిది. 
 
బిజెపి, తెలుగుదేశం పార్టీల కారణంగా ఏపీలో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితిపై చర్చించడానికి త్వరలో వామపక్షాల నాయకులతో చర్చలు జరుపనున్నాము. ప్రజల అభీష్టాన్ని నెరవేర్చడానికి ఏవిధంగా ముందుకు వెళ్లాలో ఈ సమావేశంలో నిర్ణయిస్తాము. ఆ తర్వాత లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ జయప్రకాష్ వంటి అనుభవజ్ఞులతో పాటు సీనియర్ రాజకీయ నాయకులు, మేధావులతో కూడా సమాలోచనలు జరుపుతాము... ఇట్లు పవన్ కళ్యాణ్.''