1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : ఆదివారం, 11 నవంబరు 2018 (14:55 IST)

మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టు

కర్ణాటక రాష్ట్రంలో మైనింగ్ కింగ్‌, బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిని లంచం కేసులో సీసీబీ ఆదివారం అరెస్టు చేసింది. అంబిడెంట్ కంపెనీ గ్రూపుకు సంబంధించిన రూ.18 కోట్ల లంచం కేసులో గాలి జనార్థన్‌ను విచారించిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఆయన్ను అదుపులోకి తీసుకుంది. 
 
గత మూడు రోజుల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన జనార్థన్ రెడ్డి.. శనివారం తన న్యాయవాదితో కలిసి సీసీబీ ఎదుట విచారణ‌కు హాజరైన సంగతి తెలిసిందే. ఈ కేసులో గాలి జనార్థన్ రెడ్డికి సీసీబీ పోలీసులు ఆదివారం విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన శనివారమే హాజరయ్యారు. 
 
శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు విచారించిన సీసీబీ అధికారులు అనంతరం అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఆ తర్వాత ఆయన్ను విక్టోరియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. 
 
ఆ తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టుపై సీసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది. 'విశ్వసనీయ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలం ఆధారంగా గాలి జనార్థన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని నిర్ణయానికి వచ్చాం. కోర్టు ఎదుట గాలి జనార్థన్‌ను హాజరుపరుస్తాం. ఆయన్ను విచారించేందుకు సీసీబీ కస్టడీకి పంపాలని కోర్టుకు విన్నవిస్తాం. అంబెడెంట్ గ్రూపు కాజేసిన సొమ్మును తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నాం. ఆ సొమ్మును బాధితులకు అందజేస్తాం' అని పేర్కొన్నారు.