శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2019 (13:13 IST)

జమ్మూకాశ్మీర్‌ని రెండుగా చీల్చేసిన కేంద్రం.. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏల రద్దు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రం రెండు భాగాలుగా విడగొట్టింది. తద్వారా భారత దేశ చరిత్రలో సోమవారం ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నట్లైంది. ఇందులో భాగంగా జమ్మూకాశ్మీర్, లడఖ్‌లుగా జమ్మూ కాశ్మీర్‌ను కేంద్రం విడగొట్టింది. ఇందులో లడఖ్‌ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది.


జమ్మాకాశ్మీర్‌ను అసెంబ్లీ కలిగి ఉండే కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తూ ప్రకటన చేసింది. ఇరు ప్రాంతాలకు వేర్వేరు లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. 
 
అంతేగాకుండా జమ్మూకాశ్మీర్‌కు ఇప్పటివరకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసింది. సోమవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన క్షణాల వ్యవధిలోనే ఈ పరిణామాలన్నీ చోటుచేసుకోవడం గమనార్హం.  
 
మరోవైపు కేంద్రం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏలను రద్దు చేయడంపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా స్పందించారు. సోమవారం భారత ప్రజాస్వామ్యంలోనే అత్యంత చీకటి దినమని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ నాయకత్వం 1947లో రెండు జాతులు-రెండు దేశాల సిద్ధాంతాన్ని వ్యతిరేకించి భారత్‌తో చేతులు కలిపింది. కానీ ఆ నిర్ణయం ఈరోజు కశ్మీరీల పాలిట శరాఘాతంగా మారిందన్నారు.
 
ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగవిరుద్ధమేనని మెహబూబా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనివల్ల భారత్ జమ్మూకశ్మీర్ లో దురాక్రమణదారుగా మారుతుందని చెప్పారు. 
 
జమ్మూకశ్మీర్ ప్రజలను భయపెట్టి రాష్ట్ర భూభాగాన్ని లాక్కోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని దుయ్యబట్టారు. కాశ్మీర్‌కు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో భారత్ ఘోరంగా విఫలమైందని మెహబూబా ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.