గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 మే 2020 (09:30 IST)

అద్భుతం : వ్యోమగాములను అంతరిక్షానికి చేర్చిన ప్రైవేట్ సంస్థ!

అంతరిక్షంలో అద్భుతం జరుగనుంది. ప్రైవేట్ సంస్థ పంపిన ఇద్దరు వ్యోమగాములు ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటరులో పాదం మోపనున్నారు. వీరికి ఇప్పటికే స్పేస్ సెంటరులో ఉన్న ముగ్గురు ఆస్ట్రోనట్స్ ఘన స్వాగతం పలుకనున్నారు. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షానికి కూడా వాణిజ్య సేవలు ప్రారంభించినట్టయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న హౌథ్రోన్‌లోని స్పేస్ ఎక్స్ మిషన్ కంట్రోల్ సెంటర్ నేతృత్వంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన ఇద్దరు సీనియర్ వ్యోమగాములు రోబర్ట్ బెన్ కెన్, డగ్లస్ హర్లీలు, రెండు దశల ఫాల్సన్ 9 రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లారు. డెమో-2 పేరుతో స్పేస్ ఎక్స్ సంస్థ నాసా తరపున ఈ ప్రైవేటు రాకెట్‌ను ప్రయోగించిది. 
 
ఇది నిజానికి మూడు రోజుల క్రితం వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఇదే ప్రయోగం వాయిదా పడిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకూలించడంతో శనివారం రాత్రి దీన్ని మళ్లీ ప్రయోగించారు. ఈ వ్యోమగాములు మొత్తం 19 గంటల పాటు ప్రయాణంచి స్పేస్ సెంటర్‌లో అడుగుపెడతారు. 
 
ఈ రాకెట్ ద్వారా అంతరిక్షానికి చేరుకున్న వ్యోమగాములు, నేటి రాత్రి 8 గంటల సమయంలో స్పేస్ స్టేషన్‌కు చేరనున్నారు. అక్కడ వీరికి స్వాగతం పలికేందుకు యూఎస్ ఆస్ట్రోనాట్ క్రిస్ కాసిడీ, రష్యాకు చెందిన కాస్మోనాట్స్ అనతులీ ఇవానిషిన్, ఐవాన్ వాంగర్‌లు సిద్ధంగా ఉన్నారు
 
ఇక, 'డెమో-2' అనే పేరుతో ఈ రాకెట్ ప్రయోగం జరిగింది. స్పేస్ ఎక్స్ తయారుచేసిన డ్రాగన్ క్యాప్స్యూల్‌కు నాసా సర్టిఫికెట్ లభించిన తర్వాత, ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రయోగంతో అంతరిక్షానికి వాణిజ్య సేవలను ప్రారంభించినట్లయిందని స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. తన కల నిజమైందని ఆయన అన్నారు.