1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 3 జులై 2021 (18:53 IST)

బిడ్డ పుట్టింది, కానీ రాయిలా మారుతోంది, తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

కన్నబిడ్డను కళ్లారా చూడగానే తల్లిదండ్రులు పొంగిపోతారు. ఈ ఏడాది జనవరి 31న పుట్టిన చిన్నారిని చూడగానే ఆ తల్లిదండ్రులు కూడా సంబరాలు చేసుకున్నారు. కానీ 5 నెలలు గడిచాక పాపలో ఏదో తేడా వస్తున్నట్లు గమనించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆ పాపకు అరుదైన వ్యాధి సోకిందనీ, ఈ కారణంగా ఆమె క్రమంగా రాయిలా మారుతుందని షాకింగ్ వార్త చెప్పారు. దాంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.
 
వివరాల్లోకి వెళితే... యూకెలోని హేమెల్ హెంప్‌స్టెడ్ ప్రాంతంలో అలెక్స్, దవే దంపతులు వుంటున్నారు. వీరికి గత జనవరిలో పాప పుట్టింది. ఈ బేబీకి 5 నెలల తర్వాత కాలిబొటనవేళ్లు రెండు అతుక్కున్నట్లు అగుపించాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా పాపకు ఎఫ్ఓపి అనే అరుదైన వ్యాధి సోకినట్లు తెలిపారు వైద్యులు.
 
ఈ జబ్బు 20 లక్షల మందిలో ఒకరికి వస్తుందన్నారు. ఈ జబ్బు కారణంగా శరీరంలో ఎముకలు పెరుగుతూ పోతుంటాయి. ఫలితంగా కొన్నాళ్లకి పాప కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. వీరి జీవితకాలం 40 ఏళ్లకు మించదు. 20 ఏళ్లపాటు మంచానికే పరిమితం కావాల్సి వుంటుంది. ఈ వార్త విన్న తల్లిదండ్రులు అధైర్యపడలేదు. తమ చిన్నారికి చికిత్స చేయించి ఎలాగైనా మామూలు స్థితిలో వుంచాలని ప్రయత్నాలు చేస్తున్నారు.