గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 జూన్ 2021 (15:07 IST)

ఉత్తరప్రదేశ్‌ నాలుగు ముక్కలు? : రాష్ట్ర విభజన దిశగా కేంద్రం అడుగులు!?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు రాష్ట్రాలుగా విభజించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టు సమాచారం. పూర్వాంఛల్, బుందేల్‌ఖండ్, అవద్ ప్రదేశ్, పాషిమ్ ప్రదేశ్‌ రాష్ట్రాలుగా విభజించాలన్న యోచనలో ఉన్నట్టు వినికిడి. ఇందులోభాగంగా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలో పర్యటిస్తున్నట్టు సమాచారం. గురువారం రాత్రి హోం మంత్రి అమిత్ షాను కలిసిన ఆయన... శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మధ్య గొడవలు జరుగుతున్నాయి. రాజకీయ వర్గాల్లో దీనికి కారణం ఉత్తరప్రదేశ్‌లో నాయకత్వ మార్పు, క్యాబినెట్ విస్తరణ అని చెప్తున్నప్పటికీ, అస‌లు కథ మ‌రొక‌టి వెలుగులోకి వచ్చింది. 
 
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక పూర్వాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు ఢిల్లీ, యూపీ వర్గాలు తెలిపాయి. ఇదే విష‌యంపై చ‌ర్చించేందుకు యోగి ఆదిత్య‌నాథ్ గ‌త రెండు రోజులుగా ఢిల్లీలో మ‌కాం వేసి ప్ర‌ధాన‌మంత్రి మోడీతోపాటు హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డాల‌తో సుదీర్ఘంగా చ‌ర్చిస్తున్నారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సన్నిహితుడు, మాజీ బ్యూరోక్రాట్ అయిన ఏకే శర్మను ఉత్తరప్రదేశ్‌కు పంపి అత‌డిని శాసనమండలి సభ్యుడిగా చేయడం కూడా దీనికి ముడిపడి ఉన్న‌ట్లుగా తెలుస్తుంది. ప్రధాని పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో కరోనా నిర్వహణ ప‌నుల‌ను శర్మ కొంతకాలంగా పర్యవేక్షిస్తున్నారు. 
 
నిపుణుల అభిప్రాయం ప్రకారం, వ్యాక్సిన్ అంద‌క‌పోవ‌డం, ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం, అభివృద్ధి లేక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యావ‌కాశాలు మందగించిపోయాయి. దాంతో రాష్ట్రాన్ని రెండు లేదా మూడు ముక్క‌లుగా చేసి మ‌రోసారి అక్క‌డ త‌మ హ‌వా త‌గ్గ‌లేద‌ని నిరూపించుకోవాల‌న్న ప‌నిలో బీజేపీ నిమ‌గ్న‌మై ఉన్న‌ది.
 
పార్టీ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం, గోరఖ్‌పూర్ సహా 23 నుంచి 25 జిల్లాలను పూర్వాంచల్ రాష్ట్రంగా ఏర్పాటు చేయ‌వ‌చ్చు. ఇందులో 125 అసెంబ్లీ సీట్లు కూడా ఉంటాయి. అయితే, ఈ అంశాలపై యోగి శిబిరం అంగీకరించడం లేదని చెప్తున్నారు. 
 
విశేషమేమిటంటే, ప్రత్యేక పూర్వంచల్, బుందేల్‌ఖండ్, హరిత్ ప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ చాలా కాలంగా కొనసాగుతున్న‌ది. పూర్వాంచ‌ల్ అభివృద్ధి కోసం యోగి ప్ర‌భుత్వం 28 జిల్లాల‌ను ఎంపిక చేసి కార్యక్ర‌మాల‌ను చేప‌డుతున్న‌ది. ఈ ప్రాంతంలో 2017 ఎన్నిక‌ల్లో బీజేపీ 115 సీట్లు గెలుచుకుంది. 
 
అంత‌కుముందు 1991 లో తొలిసారి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన స‌మ‌యంలో కూడా బీజేపీ ఈ ప్రాంతంలో 82 సీట్ల‌లో గెలిచి ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఇక్క‌డి 10 జిల్లాల్లో బీజేపీ వెనుక‌బ‌డి ఉంది. బీజేపీకి అనుకూల‌మైన ఓటు బ్యాంకు లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఆ 10 జిల్లాల్లో ఎక్కువ సీట్ల‌ను కైవ‌సం చేసుకోలేక‌పోతున్న‌ద‌ని నిపుణులు చెప్తున్నారు.
 
పూర్వంచల్ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పడితే యోగి బలమైన కోట గోరఖ్‌పూర్ కొత్త రాష్ట్రంలో వస్తుంది. యోగి 1998 నుంచి 2017 వరకు ఐదు సార్లు గోరఖ్‌పూర్ నుంచి లోక్‌స‌భ ఎంపీగా ఉన్నారు. గోర‌ఖ్‌పూర్ కేంద్రంలో ఉన్న గోరక్షపీఠ్‌ మహాంత్‌గా యోగి ఉన్నారు.