1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 19 ఆగస్టు 2018 (11:13 IST)

పల్నాడు గనుల దోపిడీపై సీబీఐతో విచారణకు చంద్రబాబుగారు సిద్ధమా?

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి వైకాపా అధినేత, విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. పల్నాడు గనుల దోపిడీపై సీబీఐతో విచారణకు సిద్ధమా చంద్రబాబుగారూ అంటూ ప్రశ్నించా

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి వైకాపా అధినేత, విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. పల్నాడు గనుల దోపిడీపై సీబీఐతో విచారణకు సిద్ధమా చంద్రబాబుగారూ అంటూ ప్రశ్నించారు. అలాగే, పల్నాడు ప్రాంతంలో గనుల దోపిడీ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్వీటర్‌ వేదికగా సీఎం చంద్రబాబుకి జగన్‌ ఆదివారం ఓ లేఖ సంధించారు.
 
ప్రతీరోజూ కొన్ని వేల లారీలతో ఖనిజాన్ని తరలించారని.. ఈ విషయం ఎవ‍్వరికీ తెలియదని అనుకోవాలా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే నుంచి చినబాబు, పెదబాబు వరకూ ఈ దోపిడీల్లో భాగస్వాములు కాకుంటే ఇది జరిగేదా? అని నిలదీశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఏ సహజ వనరులనూ మిగల్చలేదని మండిపడ్డారు. సీఐడీ తన చేతిలో ఉన్న సంస్థ అని చంద్రబాబు గతంలో చెప్పారని జగన్‌ గుర్తుచేశారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని జగన్‌ డిమాండ్‌ చేశారు.  
 
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను నల్లధనంతో కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన తర్వాత చంద్రబాబు అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. మీకూ ఏసీబీ ఉంది. మాకూ ఏసీబీ ఉంది. మీకూ సీఐడీ ఉంది.. మాకు సీఐడీ ఉంది. మీకూ డీజీపీ ఉన్నాడు. మాకూ డీజీపీ ఉన్నాడు అని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయాన్ని జగన్‌ ప్రస్తావించారు.
 
సీఐడీ తన చేతిలో ఉన్న సంస్థ అని చంద్రబాబు చెప్పకనే చెప్పారని జగన్‌ వ్యాఖ్యానించారు. పల్నాడు గనుల దోపిడీ వ్యవహారంలో అలాంటి వ్యక్తి సీఐడీ చేత దర్యాప్తు చేయించడం అపహాస్యం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేని సీబీఐ లాంటి ఏజెన్సీతో గనుల వ్యవహారంపై విచారణ జరిపించాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. అప్పుడే నిజా నిజాలు బయటకు వస్తాయిని, ఎమ్మెల్యే దగ్గర నుంచి చినబాబు, పెదబాబు వరకూ పేర్లు  బయటకు వస్తాయన్నారు.