మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 30 మార్చి 2021 (22:15 IST)

లావైపోతామేమోననే బెంగతోనే 50 శాతం మంది మహిళలు...

స్త్రీలు ఇంటి పనుల్లో, ఆఫీసు పనుల్లో అలుపెరగకుండా పనిచేస్తూ ఉంటారు. కానీ తమ ఆరోగ్యంపట్ల, వేళకు తాము తీసుకునే ఆహారాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా నిర్లక్ష్యం చేయడంవల్లనే వారికి ఈ సమస్యలు తలెత్తుతాయి.
 
నూటికి తొంభై శాతం మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని వైద్యులు చేపట్టిన సర్వేలో వెల్లడైంది. కీళ్ళనొప్పులు వచ్చిన తర్వాత డాక్టరును సంప్రదించి వైద్య సలహాలు తీసుకునే ముందు తమ ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహిస్తే కొన్ని భయంకరమైన వ్యాధుల బారి నుండి తప్పించుకోవచ్చని వైద్యులు సూచించారు. కీళ్ళ బాధలను వైద్యభాషలో ఆస్ట్రియోపొరాసిస్ అంటారు. వేళకింత పౌష్టికాహారం, క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామంతోనే శరీరాకృతిని అందంగా మలచుకోవచ్చని వైద్యులు చెపుతున్నారు.
 
లావైపోతామేమోననే బెంగతోనే 50 శాతం మంది మహిళలు తినడం మానేస్తున్నారని సర్వేలో తేలింది. ఆహారం మానేసినంత మాత్రాన సన్నబడటం మాట అలా ఉంచితే లేని జబ్బులు కొని తెచ్చుకోవడమేనని వైద్యులు పేర్కొన్నారు. సహజంగా మహిళలు 40-45 సంవత్సరాల వయసు దాటిన తరివాతే కీళ్ళనొప్పులు ప్రారంభమౌతాయని వైద్యులు చెబుతున్నారు.
 
కాని గత పదేండ్లుగా 25 సంవత్సరాల వయసు కల మహిళల్లో ఈ జబ్బు విపరీతంగా కనపడుతుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మన శరీరానికి కావాల్సిన కాల్షియం, విటమిన్ డిలు తక్కువైనప్పుడు ఎముకలు బలహీనపడుతాయని అలాంటి సందర్భాలలో ఆస్ట్రియోసొరాసిస్ వ్యాధి రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. ఈ వ్యాధి బారిన పడినవారు జీవితాంతం బాధను అనుభవించాల్సిందేనని, కాని అతి తక్కువమంది మాత్రమే ప్రాణాపాయస్థితికి చేరుకునే అవకాశముందంటున్నారు వైద్యులు.
 
ఈ సమస్యను అధిగమించడానికి చేయాల్సిందల్లా ఒక్కటే మార్గం. క్రమంతప్పకుండా పోషకాహారం తీసుకోవడం, ప్రతిరోజు వ్యాయామం చేయడం వలన ప్రాణాంతక‌మైన వ్యాధుల బారిన పడకుండా తమను తాము కాపాడుకోవచ్చని, కనీసం సంవత్సరానికి ఒకసారైనా మహిళలు పూర్తిస్థాయిలో ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.