శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జులై 2020 (19:57 IST)

మారటోరియం పొడగింపు?.. వ్యక్తిగత రుణాలకు మాత్రం...?? (video)

దేశంలో కరోనా వైరస్ విజృంభణ ఏమాత్రం తగ్గలేదు. ప్రతి రోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అనేక రంగాలు ఇంకా పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. ఈ కారణంగా ఆర్థిక రంగం ఇంకా కుదటపడలేదు. వీటన్నింటినీ విశ్లేషించిన భారత రిజర్వు బ్యాంకు... ప్రస్తుతం రుణాలపై అమలు చేస్తున్న మారటోరియంను మాత్రం మరో మూడు నెలలు పొడగించాలన్న ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారికి ఈ వెసులుబాటు ఉండకపోవచ్చని ఆర్బీఐ వర్గాల సమాచారం. 
 
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అన్ని రకాల రుణాల చెల్లింపులపై మారటోరియాన్ని ప్రకటించిన ఆర్బీఐ ఆపై దాన్ని మరో మూడు నెలలు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికీ చాలా రంగాలు లాక్డౌన్ ప్రభావం నుంచి బయటపడక పోవడంతో ఆగస్టు 31తో ముగియనున్న మారటోరియాన్ని మరికొంతకాలం పొడిగించాలన్న ఆలోచనలో ఆర్బీఐ ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఈ మేరకు చర్చలు కూడా జరిగాయని, అయితే, అన్ని రంగాలకూ కాకుండా, ఇప్పటికీ తీవ్ర ఒత్తిడిలో ఉన్న విమానయాన రంగం, ఆటోమొబైల్స్, హాస్పిటాలిటీ, టూరిజం తదితర రంగాలకు మినహాయింపులు ఇచ్చే యోచన చేస్తున్నట్టు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ రంగాల్లో రుణాలు ఏ మేరకు ఉన్నాయి? తనఖా ఆస్తుల విలువెంత? తదితర అంశాలను ఆర్బీఐ మదిస్తున్నట్టు సమాచారం. 
 
అయితే, వ్యక్తిగత రుణ గ్రహీతలకు మాత్రం మరోమారు మారటోరియం పొడిగింపు అవకాశాలు లేవని తెలుస్తోంది. చాలా రంగాలు తిరిగి తెరచుకోగా, వ్యక్తిగత రుణాలపై మారటోరియం పొడిగించాల్సిన అవసరం లేదని ఆర్బీఐ భావిస్తోంది. 
 
బ్యాంకుల నుంచి వెల్లడైన సమాచారం ప్రకారం, ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో బ్యాంకులు ఇచ్చిన రుణాలను తీసుకున్న వారిలో 29 శాతం, ఆర్థిక సేవల సంస్థలు ఇచ్చిన రుణాలు తీసుకున్న వారిలో 59 శాతం మారటోరియం సదుపాయాన్ని వినియోగించుకున్నారు. సరాసరిన 30.6 శాతం మంది రుణ గ్రహీతలు ఈఎంఐలను చెల్లించలేదు. అంటే 70 శాతం మంది ఈఎంఐలను చెల్లించినట్టు తెలుస్తోంది. అందుకే పర్సనల్ లోన్స్‌కు ఈ మినహాయింపు ఉండకపోవచ్చని తెలుస్తోంది.