ట్వంటీ-20 వరల్డ్ కప్ను టీమిండియా గెలిచి తీరుతుంది: శ్రీకాంత్
భారత్లో వచ్చే ఏడాది జరుగనున్న ట్వంటీ-20 ప్రపంచ కప్ టోర్నీని టీమిండియా గెలిచి తీరుతుందని టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ చెప్పారు. ఇప్పటికే ట్వంటీ-20 వరల్డ్ కప్ ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియాను పొట్టి ఫార్మాట్లో బలమైన జట్టుగా అందరూ భావిస్తున్నారని, తద్వారా భారత జట్టుకు వరల్డ్ కప్ ట్వంటీ-20 ట్రోఫీని సొంతం చేసుకునే ఛాన్సుందని హైదరాబాదులో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
టీమిండియా ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన శ్రీకాంత్, భారత్లో ట్వంటీ-20కి మంచి ఆదరణ ఉందని తెలిపారు. ఈ ఫార్మాట్లో భారత క్రికెటర్లు మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇదేవిధంగా టీ-20 ఫార్మాట్లో భారత్ గట్టిపోటీని ప్రదర్శించి వరల్డ్ కప్ విజేతగా అవతరిస్తుందని శ్రీకాంత్ ఆశించారు.