శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 10 జులై 2024 (11:56 IST)

వ్యూహాత్మక నైపుణ్యంతో క్రికెటర్లను సానబెట్టిన ద్రావిడ్ : జై షా ప్రశంసలు

jai sha - dravid
భారత క్రికెట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పూర్తిగా తప్పుకున్నాడు. అతని స్థానంలో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ మంళవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. దీంతో టీమిండియా ప్రధాన కోచ్‌ బాధ్యతలను గౌతం గంభీర్‌కు అప్పగిస్తున్నట్టు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించారు. తాజాగా కోచ్ పదవి నుంచి దిగిపోయిన రాహుల్ ద్రావిడ్‌కు జై షా వీడ్కోలు సందేశాన్ని ఇచ్చారు.
 
భారత జట్టుకు అత్యంత విజయవంతమైన ప్రధాన కోచ్ పదవీకాలం ముగించిన రాహుల్ ద్రావిడ్‌కు జై షా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ద్రావిడ్ మార్గదర్శకత్వంలో భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌ను సాధించిందని, అన్ని ఫార్మాట్లలో ఆధిపత్య టీమ్ భారత జట్టు అవతరించిందని పేర్కొన్నారు. వ్యూహాత్మక నైపుణ్యం, నిరంతర కృషితో ఆటగాళ్ల ప్రతిభకు రాహుల్ ద్రావిడ్ సానపెట్టారని జైషా ప్రశంసించారు. 
 
జట్టులో ఆదర్శప్రాయమైన నాయకత్వాన్ని నెలకొల్పారని, జట్టులో తన వారసత్వాన్ని నింపారని కొనియాడారు. నేడు భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఒకరి విజయాన్ని మరొకరు ఆనందిస్తున్నారని, సవాళ్లను ఎదుర్కొంటూ ఒక్కటిగా ముందుకు సాగడానికి బాటలు వేశారంటూ ప్రశంసించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా జై షా స్పందించారు.
 
మరోవైపు, భారత జట్టుకు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ మూడేళ్ల పాటు పనిచేశారు. టీ20 ప్రపంచకప్, ఆసియా కప్‌ను గెలిపించారు. 2023 వన్డే ప్రపంచకప్ తృటిలో చేజారింది. ఫైనల్ మ్యాచ్ భారత్ ఓడిపోయింది. 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విషయంలోనూ ఇదే జరిగింది. ఫైనల్లో ఓడిపోయింది. ఈ రెండు టైటిల్ పోరుల్లోనూ ప్రత్యర్థి ఆస్ట్రేలియానే కావడం గమనార్హం.