శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (13:18 IST)

ఫిబ్రవరి 28 : జాతీయ సైన్స్ దినోత్సవం... సీవీ రామన్ పుట్టినరోజు

దేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్తల్లో సర్‌ సీవీ రామన్ ఒకరు. ఈయన కేఎస్‌ కృష్ణన్‌తోపాటు ఇతర శాస్త్రవేత్తలతో కలిసి 1928లో సరిగ్గా ఇదే రోజున రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. ఆయన ఆవిష్కరణలకు గౌరవ సూచకంగా ఫిబ్రవరి 28వ తేదీని జాతీయ సైన్స్‌ దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ ఆవిష్కరణకుగాను సర్‌ సీవీ రామన్‌కు 1930లో సైన్స్ నోబెల్ బహుమతి కూడా వరించింది. 
 
సర్ సీవీ రామన్ సైన్స్ రంగంలో చేసిన కృషికి 1954 లో భారతరత్న అందుకున్నారు. కాంతి వికీర్ణ ప్రభావాన్ని కనుగొన్నందుకు అతనికి 1930లో భౌతిక శాస్త్ర నోబెల్ లభించింది. నోబెల్ ఆఫ్ సైన్స్ గెలుచుకున్న తొలి భారతీయుడు రామన్. సర్‌ సీవీ రామన్‌ 1888 నవంబర్ 7న మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించారు. 
 
1907లో అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్ పదవిలో చేరినప్పటికీ.. సైన్స్‌పై అమితమైన ప్రేమను చూపేవాడు. ఏదో ఒకవిధంగా ప్రయోగశాలకు చేరుకుంటూ పరిశోధనలు కొనసాగించేవారు. 1917లో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి కోల్‌కతా విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర ప్రొఫెసర్‌గా చేరారు. ఇక్కడే రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. 
 
కాంతి కిరణం పారదర్శక వస్తువు గుండా వెళితే.. దాని తరంగ తరంగదైర్ఘ్యం మారుతుందని సీవీ రామన్ నిరూపించారు. దీనినే రామన్ ఎఫెక్ట్‌గా పిలుస్తారు. రామన్ ఎఫెక్ట్‌ ఇప్పటికీ చాలా చోట్ల ఉపయోగిస్తున్నారు. చంద్రయాన్-1 మిషన్‌లో చంద్రుడిపై నీటి జాడను ప్రకటించినప్పుడు దాని వెనుక రామన్ స్పెక్ట్రోస్కోపీ అద్భుత కృషి కూడా దాగుంది. 
 
రామన్ ఎఫెక్ట్‌ ఫోరెన్సిక్ సైన్స్‌లో కూడా చాలా ఉపయోగకరంగా ఉందని రుజువు చేస్తోంది. ఎప్పుడు, ఎలా సంఘటనలు జరిగాయో తెలుసుకోవడం సులభమైంది. 1970లో 82 సంవత్సరాల వయసులో రామన్‌ కన్నుమూశారు.