లంచం తీసుకుంటూ పట్టుబడ్డ టీటీడీ ఇంజనీర్ కు రిమాండ్
ఒక కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(రాజమండ్రి) రామకృష్ణారావుకు ఏసీబీ కోర్టు 15 రోజులు రిమాండ్ విధించింది. వివరాలిలా ఉన్నాయి.
ఈ నెల 8న శ్రీకాకుళం, 16న విజయనగరం జిల్లాల్లో జరిగిన శ్రీనివాస కల్యాణ మహోత్సవాలకు సంబంధించిన బిల్లులు రూ. 3.93 లక్షలు మంజూరుకు పృధ్వీరాజ్ అనే కాంట్రాక్టర్ నుం చి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ డీఈఈ రామకృష్ణారావు బుధవారం ఏసీబీ అధికారులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే.
అయితే రామకృష్ణారావును గురువారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరు పరచగా అతడికి 15 రోజులపాటు రిమాండ్ విధించినట్టు ఏసీబీ రాజమండ్రి రేంజ్ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. అలాగే అతడి ఇంటిలో సోదాలు చేయగా.. ఒక స్థలం... ఒక ఇంటికి సంబంధించిన పత్రాలు దొరికాయని, అవి న్యాయబద్ధంగానే ఉన్నాయని వివరించారు.