రవిరాజా పినిశెట్టి కుమారుడుగా నటుడిగా తెలుగు తెరకు పరిచయమైనా.. తమిళనాటే ఆయనకు గుర్తింపు వచ్చింది. తమిళంలో చేసిన 'మృగం' తెలుగులో గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాలు డబ్ అయ్యాయి. 'మలుపు' పేరుతో కూడా సొంత సినిమాను తెలుగులో విడుదల చేశారు. పర్వాలేదనిపించింది. గతంలో తేజ దర్శకత్వంలో 'ఒక విచిత్రం'తో కెరీర్ను ప్రారంభించి.. హీరోగా ఎదుగుతున్న తను అనుకోకుండా విలన్గా మారాడు. బోయపాటి శ్రీను యువ విలన్గా 'సరైనోడు'లో మార్చాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాలో తన పాత్ర గురించి, భవిష్యత్ ప్రణాళికల గురించి ఇంటర్వ్యూలో వెల్లడించారు.
విలన్గా చూశాక.. మొదటి ఫోన్ ఎక్కడ నుంచి వచ్చింది?
ఇంతకుముందు చేసిన సినిమాల కంటే ఈ సినిమాలో చేయడంతో ఎక్కువగా ఫోన్ కాల్స్ వచ్చాయి. తమిళనాడులో కూడా విడుదలైంది. ప్రతి ఒక్కరు కాల్ చేసి మెచ్చుకుంటున్నారు. తమిళంలో డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చే సినిమాలు బాగా నడుస్తాయి. 'సరైనోడు' పక్కా కమర్షియల్ సినిమా అయినా.. అక్కడ ఆడియన్స్కు బాగా నచ్చింది. గ్రాండియర్గా ఉందంటున్నారు. నా నటన చూసి 'తని ఒరువన్' సినిమాలో అరవింద్ స్వామితో పోలుస్తున్నారు. నాన్నగారు మొదటగా అభినందించారు.
హీరోగా చేస్తూ విలన్గా మారడం ఇబ్బంది అనిపించలేదా?
నటుడిగా వుండాలన్నదే నా కోరిక. హీరోనా, విలనా అనేది చూడను. 'మృగం' సినిమాలో నేను ఒకరకమైన విలన్గానే చేశాను. క్రూరత్వం వున్న పాత్ర అది.. దాన్ని ఆదరించారు. ఆ తర్వాత 'వైశాలి' చేశాను. అదీ మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు అనుకోకుండా సరైనోడులో విలన్గా అవకాశం వచ్చింది. హీరోగా కెరీర్ ప్రారంభించినా పాత్ర ఆసక్తికరంగా అనిపిస్తే విలన్గా నటించడానికి సిద్ధంగా ఉన్నా. అయితే కథతోపాటు నటనకు అవకాశమున్న సినిమా అయితేనే నటిస్తాను
ఈ అవకాశం ఎలా వచ్చింది?
ఓసారి అల్లు అరవింద్ గారు ఫోన్ చేసి ఒక కథ విను. నీకు నచ్చితేనే చెయ్.. లేదంటే మొహమాట పడకుండా చెప్పేయ్ అన్నారు. అయితే 25 నిమిషాలు వినగానే ఖచ్చితంగా ఇందులో భాగమవ్వాలని నిర్ణయించుకున్నాను. నేను ఈ సినిమాలో చేసింది సాధారణ విలన్ పాత్ర కాదు. చాలా పవర్ఫుల్గా ఉండే రోల్.
ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ చేశారా?
కొంత ప్రాక్టీస్ చేశారు. విలన్గా ఎలా కనిపించాలా! మేనరిజం ఎలా వుండాలి. లుక్ అవన్నీ.. సజెషన్స్ తీసుకున్నా... అయితే స్పాట్కు వెళ్ళగానే బోయపాటి గారి మైండ్లో నేను అనుకున్నదానికంటే పవర్ ఫుల్ విలన్ ఉన్నాడు. ఇక నేను ప్రాక్టీస్ చేసిందంతా.. పక్కన పెట్టేసి బోయపాటి చెప్పినట్లు విన్నాను. ఆయన చెప్పింది నలభై శాతం మాత్రమే నటించాను.
అల్లు అర్జున్ మీ రోల్ చేస్తానని ఆడియోనాడు అన్నారు?
అవును. నాతో కూడా చెప్పారు. చిత్రీకరణ సమయంలో మాత్రం చేసేవాడిని. మా ఇద్దరి మధ్య హెల్దీ డిస్కషన్స్ జరిగేవి. బన్నీకి నా రోల్ బాగా నచ్చింది. ఇదే సినిమాను మరొక ల్యాంగ్వేజ్లో చేస్తే 'నీ రోల్లో నేను నటిస్తానని' చెప్పేవాడు.
మెగా కుటుంబం నుంచి ఎలా రెస్పాన్స్ వచ్చింది?
చిరంజీవి, వినాయక్, టెక్నీషియన్స్ ఇలా అందరూ ఫోన్ చేశారు. ముఖ్యంగా చిరంజీవి గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఐదు నిమిషాల పాటు మాట్లాడారు. నాకు మధ్యలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. మొదటిసారి ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడారు. మరోసారి ఇలాంటి అవకాశం వస్తుందో.. రాదో కూడా నేను చెప్పలేను. నా డిక్షన్, బాడీ ల్యాంగ్వేజ్ ఇలా ప్రతి ఒక్కదాని గురించి మాట్లాడారు. నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అది.
ఇకపై విలన్గానే చేస్తారా?
అదేం లేదు. హీరోగానూ విలన్గానూ చేయడానికి సిద్ధం. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని చేస్తాను.
మరలా మీ అన్నయ్య దర్శకత్వంలో చేస్తారా?
నేను అన్నయ్య డైరెక్షన్లో 'మలుపు' చేశాను. తనతో మరో సినిమా చేయాలనుంది. డైరెక్టర్కు, హీరోకు సింక్ అయ్యి.. కథ బావుంటే సినిమా హిట్ అవుతుంది. మా అన్నయ్యకు నాకు బాగా సింక్ అవుతుంది.
హీరో, విలన్ ఈ రెండింటిలో ఏది సుఖం?
విలన్, హీరోలలో హీరో వర్క్ చేయడమే కష్టం. యాక్షన్స్ సీక్వెన్సెస్, డాన్సులు ఇలా ప్రతి ఒక్క విషయంలో హీరో కష్టపడతాడు. ఈ సినిమాను బన్నీ తన భుజాలపై వేసుకొని నడిపించాడు. విలన్ అంటే. మనకిష్టం వచ్చినట్లు చేయవచ్చు. లిమిట్స్ వుండవు. హీరోకు.. కొన్ని పరిమితులుంటాయి. అవి బ్యాలెన్స్ చేసుకోవాలి.
పెండ్లి బాజాలు మొదలయ్యాయా?
ప్రస్తుతానికి ఇంట్లో నాకు పెళ్లి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే జైలుకి వెళ్ళబోతున్నాను (నవ్వుతూ..). తెలుగమ్మాయినే పెళ్లి చేసుకుంటా.. నేనైతే ఎవరిని చూసుకోలేదు. పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటాను.
తదుపరి చిత్రాలు
ద్విభాషా చిత్రం కొత్త డైరెక్టర్తో ప్లాన్ చేస్తున్నాం. నిధిని వెతుక్కుంటూ... వెళ్ళిన ఒక గ్యాంగ్ వారికి ఎదురైన సంఘటనలు ఎంటర్టైన్మెంట్ రూపంలో తెరకెక్కిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో డిఫరెంట్ కాన్సెప్ట్తో ఎవరైనా కథలు తీసుకొస్తే మా బేనర్లో చిన్న సినిమాలు చేయాలనుకుంటున్నాం అని చెప్పాడు.