సీబీఐ డైరక్టర్ ఎంపికకు ఇద్దరుంటే చాలు...!
సీబీఐ డైరక్టర్ ఎంపికకు ఇద్దరు చాలునని నియామక బిల్లుకు సవరణలు చేశారు. దేశంలోనే అత్యున్నత నేర పరిశోధన సంస్థ సీబీఐ డైరెక్టర్ నియామకంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సవరణల బిల్లుకు బుధవారం పార్లమెంటు ఆమోదం తెలిపింది.
ఇకపై సీబీఐ డైరక్టర్ను ఎంపిక చేసేందుకు ముగ్గురు సభ్యుల్లో ఇద్దరుంటే చాలనే విధంగా సీబీఐ చీఫ్ నియామక బిల్లులో కేంద్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది.
తాజా బిల్లు ప్రకారం, సీబీఐ డైరెక్టర్ నియామకాన్ని ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభలో ప్రతిపక్షనేత కలిసి నిర్ణయిస్తారు. అయితే, ఇందులో ఏ ఒక్కరు గైర్హాజరైనా.. మిగిలిన ఇద్దరు కలిసి నియామకం చేయొచ్చని కేంద్రం తాజా బిల్లులో పేర్కొంది.
అయితే, ఈ నిబంధనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఎప్పుడూ ఖాళీగా ఉండబోరని లోక్సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకునే ఈ నిబంధన పెట్టారని ఆయన విమర్శించారు. ఇప్పటీకీ ప్రతిపక్ష నేతను ప్రభుత్వం గుర్తించలేదని, కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఆయన అన్నారు.