ఢిల్లీలో హైటెక్ చోరీ - అత్యాధునిక ఫీచర్లు ఉన్నప్పటికీ 60 సెకన్లలో హైజాక్
దేశ రాజధాని న్యూఢిల్లీలో వరుస చోరీలు జరుగుతున్నాయి. దీంతో ఢిల్లీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా అత్యాధునిక ఫీచర్లు ఉన్న కారులో చోరీ జరగటం ఇపుడు ప్రతి ఒక్కరినీ షాక్కు గురిచేసింది. అత్యాధునిక భద్రతా ఫీచర్లతో తయారుచేసిన ఓ కారును దొంగలు కేవలం 60 సెకన్లలోనే ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కారు యజమాని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అదేసమయంలో కారులో అమర్చే అత్యాధునిక భద్రతా ఫీచర్లపై సరికొత్త చర్చ మొదలైంది.
ఢిల్లీలోని సర్దార్ జంగ్ ఎన్ క్లేవ్లో నివసించే రిషభ్ చౌహాన్ తన కారును ఇంటిముందు పార్క్ చేయగా దొంగలు అపహరించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా మొదట ఓ కారు వచ్చి ఆగింది. అందులోంచి దిగిన ఓ వ్యక్తి, పార్క్ చేసి ఉన్న రిషబ్ కారు అద్దం పగలగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అదే కారు మళ్లీ వచ్చి ఆగింది. ఈసారి మాస్క్ ధరించిన మరో వ్యక్తి కారులోంచి దిగి, కారు సెక్యూరిటీ సిస్టమ్ను హ్యాక్ చేసి, క్షణాల్లో స్టార్ట్ చేసి తీసుకెళ్లిపోయాడు. ఆరు నెలల క్రితమే కొనుగోలు చేసిన తన కారు నిమిషంలోపే చోరీకి గురవడంపై చౌహాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై రిషభ్ చౌహాన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ, "ఓ కంపెనీ కార్ల సెక్యూరిటీ సిస్టమ్ ఎంత బలహీనంగా ఉందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. దానిని సులభంగా హ్యాక్ చేయవచ్చు. ఆ కంపెనీ కారు కొనుగోలు చేసేవారు జాగ్రత్తగా ఉండండి" అని హెచ్చరించారు. ఢిల్లీలోనే పరిస్థితి ఇలావుంటే, దేశంలోని ఇతర ప్రాంతాల్లో భద్రత ఎలా ఉంటుందోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పోస్టు సదరు కార్ల కంపెనీకి ట్యాగ్ చేయగా, కంపెనీ స్పందించింది. "విషయాన్ని పరిశీలిస్తున్నాం. మీకు సహాయం చేయడానికి మీ కాంటాక్ట్ వివరాలు పంపండి" అని రిప్లై ఇచ్చింది. ఈ వీడియోకు ఇప్పటికే 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.