భారత హాకీ జట్టు కోచ్గా రోలంట్ ఓల్ట్మన్స్ నియామకం
భారత హాకీ జట్టు కోచ్గా రోలంట్ ఓల్ట్మన్స్ను ఎంపిక చేశారు. వచ్చే యేడాది జరగనున్న రియో ఒలింపిక్స్ వరకూ ఓల్ట్మన్స్ను కోచ్గా నియమించినట్టు హాకీ ఇండియా (హెచ్ఐ) శనివారం అధికారికంగా వెల్లడించింది. ఇప్పటివరకు భారత హాకీ జట్టు కోచ్గా నెదర్లాండ్స్కు చెందిన పాల్ వాన్ యాస్ ఉండగా, ఆయనపై వేటు పడిన నేపథ్యంలో హెచ్ఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) డైరెక్టర్ జనరల్ ఐ శ్రీనివాస్తో హెచ్ఐ అధ్యక్షుడు నరీందర్ బాత్రా సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్గా ఉన్న నెదర్లాండ్స్కే చెందిన ఓల్ట్మన్స్ భారత హాకీ జట్టుతో కలిసి మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. రియో ఒలింపిక్స్కు ఏడాది సమయమే ఉన్న నేపథ్యంలో అతన్నే కోచ్గా చేయాలని హెచ్ఐ భావించింది. ‘కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు ఓల్ట్మన్స్ అంగీకరించాడు. రియో ఒలింపిక్స్ వరకు అతడు కోచ్గా ఉంటాడు. అయితే ఆ తర్వాత కూడా మేం అతన్ని కొనసాగించాలని అనుకుంటున్నామ’ని బాత్రా వెల్లడించాడు.