శనివారం, 5 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

సినీ ఫక్కీలో కారు అడ్డగించి.. రూ.40 లక్షల దోపిడీ.. ఎక్కడ?

robbery
సినీ ఫక్కీలో కారును అడ్డిగించిన కొందరు దోపిడీ దొంగలు రూ.40 లక్షలు దోపిడీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న దుండిగల్ పోలీసులు రంగంలోకి దిగి కేవలం 24 గంటల్లోనే దోపిడీకి పాల్పడిన దొంగలను అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బౌరంపేటలో దుర్గా ఆటోమొబైల్స్‌ గ్యారేజీని మల్లికార్జున్‌ రావు నిర్వహిస్తున్నారు. అక్కడ సూరారం విశ్వకర్మ కాలనీకి చెందిన జాల అనిల్‌ కుమార్‌(30) గతంలో అకౌంటెంట్‌గా పనిచేశాడు. రెండేళ్ల క్రితం అతణ్ని విధులు నుంచి తొలగించడంతో యజమానిపై పగ పెంచుకున్నాడు. గ్యారేజీలో పనిచేసే మెకానిక్‌ మల్లేష్‌ సాయంతో యజమానిని దెబ్బతీసేందుకు పథకం పన్నాడు. 
 
ఈ నెల 23న మల్లికార్జున రావు మాదాపూర్‌కు చెందిన తన స్నేహితుడి నుంచి రూ.40 లక్షలు తీసుకురావాలని ప్రస్తుత అకౌంటెంట్‌ సాయిరాం, మెకానిక్‌ మల్లేష్‌లకు చెప్పగా వారు కారులో నగదు తీసుకొస్తున్నారు. మల్లేష్‌ ద్వారా విషయం తెలుసుకున్న అనిల్‌ కుమార్‌.. సూరారంలో నివసించే తన మిత్రులు ఎం.శివచరణ్‌, ఎస్‌.వెంకటరమణరాజు, ఈ.రాజుతో కలిసి శుక్రవారం ఉదయం బౌరంపేట వద్ద కారును అడ్డగించి, సాయిరాంను తోసేసి నగదు ఉన్న బ్యాగుతో పరారయ్యారు.
 
బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన దుండిగల్‌ పోలీసులు అనుమానితులపై నిఘాపెట్టి ఫోన్‌కాల్స్‌ ఆధారంగా మల్లేష్‌, అనిల్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించారు. ఇతర నిందితులను సూరారంలో శనివారం ఉదయం అరెస్టు చేశారు. దోచుకెళ్లిన నగదుతో ఐఫోన్‌తో పాటు మరో ఖరీదైన చరవాణిని కొనుగోలు చేశారు. వారి నుంచి రూ.37.90 లక్షల నగదు స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు పంపారు.