1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 8 జనవరి 2022 (20:00 IST)

పోలవరం ప్రాజెక్టు పరిశీలించిన సీఎం ముఖ్య కార్యదర్శి

పోలవరం ప్రాజెక్టు పురోగతిపై సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు పనులను శనివారం ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్ తో కలిసి  క్షేత్రస్థాయిలో పనుల తీరును  పరిశీలించారు. ముందుగా స్పిల్ వే, గేట్ల పనితీరును, ఎగువ కాఫర్ డ్యామ్,  ఫిష్ లాడర్ , దిగువ కాఫర్ డ్యామ్ పనులను అధికారులు పరిశీలించారు. 
 
 
గతంలో గోదావరి కి వరద జలాలు స్పిల్వే ద్వారా విడుదల చేసిన  నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లు, గేట్ల పనితీరు తదితర అంశాలపై అధికారులు వివరించారు. పెండింగులో ఉన్న డిజైన్ల అంశాలపై అధికారులతో మాట్లాడారు. అనంతరం ప్రాజెక్టు  ప్రాంతానికి చేరుకుని అక్కడి నుండి స్పిల్వే పనులను పరిశీలించి, కాపర్ డ్యామ్ వద్ద జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పోలవరం నిర్వాసితుల గ్రామాలకు చెందిన 19 గ్రామ ప్రజల  సమస్యలు పరిష్కరించాలని వారి ప్రతినిధులు ప్రవీణ్ ప్రకాష్ వారికి వినతి పత్రం అందజేశారు. 
 
 
పోలవరం ప్రాజెక్టు పనుల వివరాలు పోలవరం ప్రాజెక్ట్ సీఈ  బి.సుధాకర్ బాబు, ఎస్ ఈ  నరసింహ మూర్తి  లు ముఖ్య కార్యదర్శి కి, జిల్లా కలెక్టర్ కి వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ సీఈ బి.సుధాకర్ బాబు,ఎస్ ఈ నరసింహ మూర్తి, ఆర్డీవో వై. ప్రసన్న లక్ష్మి, డిఎస్పీ కె.లతాకుమారి, ఈఈలు, డీఈఈలు పి. సుధకర్ రావు, మల్లిఖార్జున రావు, ఆదిరెడ్డి, మేఘా ఇంజనీరింగ్ బృందం, తదితరులు పాల్గొన్నారు.