1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (19:37 IST)

నిబంధనలకు తూట్లు : ఏపీ సర్కారుకు రూ.120 కోట్ల అపరాధం

పోలవరం ప్రాజెక్టు పనుల్లో నిబంధనలు యధేచ్చగా ఉల్లంఘించినందుకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కొరఢా ఝుళిపించింది. ఏకంగా రూ.120 కోట్ల మేరకు అపరాధం విధించింది. 
 
గతంలో పోలవరం పర్యావరణ అంశాలపై సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు, మాజీ శాసనసభ్యుడు వసంతకుమార్ గతంలో ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై విచారణ జరిపిన ఎన్జీటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ముఖ్యంగా, పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పోలవరం, పరిధిలోని పురుషోత్తమ పట్నం, చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పనులు కొనసాగిస్తున్నందుకుగాను ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసి, భారీ అపరాధం విధించారు. 
 
ఏపీకి విధించిన రూ.120 కోట్ల అపరాధంలో పురుషోత్తంపట్నకు రూ.24.56 కోట్లు, పట్టిసీమకు రూ.24.90 కోట్లు, చింతలపూడికి రూ.73.6 కోట్లు చొప్పున జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
పైగా, ఈ అపరాధాన్ని మూడు నెలల్లోగా కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని  ఆదేశించింది. అలాగే, ఈ అపరాధం నిధుల వినియోగంపై కూడా ఏపీపీసీబీ, సీపీసీబీ సభ్యులతో ఒక కమిటీని నియవించాలని సూచన చేసింది.