జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు : తితిదే వెల్లడి
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వెల్లడించింది. అయితే, తొలి మూడు రోజుల పాటు ఎలక్ట్రానికి డిప్, ఆ తర్వాతి రోజులకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్-2 ద్వారా సర్వదర్శనాలు ఉంటాయని తితిదే అధికారులు వెల్లడించారు.
ఈ క్రమంలో తొలి మూడు రోజులు ఎస్ఈడీ, శ్రీవాణి దర్శనాలు రద్దు చేయనున్నట్లు తెలిపింది. ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శన రోజులైన డిసెంబరు 30 నుంచి జనవరి 8 వరకు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
తొలి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు నవంబరు 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి డిసెంబరు ఒకటో తేదీ సాయంత్రం 5 గంటల వరకు తితిదే వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in/, తితిదే యాప్, వాట్సాప్లో ఏపీ గవర్నమెంట్ బాట్లో తితిదే ఆలయాల విభాగంలో ఎలక్ట్రానిక్ డిప్కు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబరు 2వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ వివరాలు వెల్లడిస్తారు.