శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2019 (12:51 IST)

తారక్ బాటలో చెర్రీ - బన్నీ : రాజకీయ గోలకు దూరంగా మెగా హీరోలు

స్వర్గీయ ఎన్టీఆర్ మనుమడు ఎన్.టి.రామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్. గతంలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆ పార్టీలో చక్రం తిప్పాలని భావించాడు. కానీ, పార్టీలో పరిస్థితులు తనకు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో వెనక్కి తగ్గారు. ఆ తర్వాత గత యేడాది జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కూడా తన అక్క సుహాసిని కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగింది. అపుడు కూడా తారక్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. 
 
ఇపుడే ఈ వంతు మెగా ఫ్యామిలీ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌ల వంతు వచ్చింది. మెగా ఫ్యామిలికీ చెందిన హీరో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారిపోయాడు. ఈయన సినిమాలకు కూడా స్వస్తినట్టుగానే ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. నిజానికి జనసేన పార్టీ తరపున ప్రచారం చేయాలని చెర్రీ, బన్నీలు భావించారు. ఇదే విషయాన్ని పలుమార్లు వారు పలు వేదికలపై వెల్లడించారు కూడా.
 
కానీ, ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ సామాజిక పరిస్థితుల దృష్ట్యా వారిద్దరూ కూడా ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. ప్రస్తుతం చెర్రీ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా, రెండో షెడ్యూలో కోసం వడోదరాకు వెళ్లాడు. 
 
ఇకపోతే, అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ చిత్రం కోసం బన్నీ సిద్ధమవుతున్నాడు. దీంతో అల్లు అర్జున్ కూడా ప్రచారానికి దూరంగా ఉండనున్నాడు. మరో ఇద్దరు మెగా ఫ్యామిలీ హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌లు కూడా ఇదే బాటలో నడువనున్నారు. అయితే, వరుణ్ తేజ్ తండ్రి, సినీ నటుడు నాగబాబు మాత్రం నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటం గమనార్హం. అయినా సరే వరుణ్ తేజ్ ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.