1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 3 మే 2018 (16:23 IST)

దాచేపల్లి ఘటనపై చంద్రబాబు ఆగ్రహం.. నిందితుడిని పట్టిస్తే ప్రైజ్

గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశించారు.

గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టిచ్చిన వారికి నగదు బహుమతి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. వెంటనే దాచేపల్లికి వెళ్లాలని జిల్లా మంత్రులు, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ను ఈ మేరకు ఆదేశించారు.
 
ఇదిలావుండగా, అత్యాచారానికి గురైన బాలికను గుంటూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ బాలికను గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పరామర్శించారు. బాలిక ఆరోగ్యపరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్య సేవలందించాలని కోన శశిధర్ ఆదేశించారు. 
 
ఆతర్వాత ఆయన స్పందిస్తూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పోక్సో చట్టం కింద బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. 
 
ఇదిలావుండగా, బాలికపై లైంగికదాడికి పాల్పడిన వృద్ధుడిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులంతా కలిసి ఆందోళనకు దిగారు. వీరంతా కలిసి నిందితుడిని ఇంటిని ధ్వంసం చేశారు. ఆ తర్వాత స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. బుధవారం అర్థరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకూ అద్దంకి - నార్కట్ పల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.