శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 మే 2020 (17:54 IST)

మందు దొరికింది.. ఇంకెందుకు లేటు.. లిక్కర్ షాపు ముందే తాగేసింది...

హైదరాబాద్ నగరంలో కొంతమంది అమ్మాయిలు విదేశీ యువతలకు ఏమాత్రం తీసిపోమని నిరూపించారు. మద్యం దుకాణాల ఎదుట బారులు తీరారు. మద్యం బాటిల్ చేతికి రాగానే... అక్కడే ఓపెన్ చేసి గుటకేశారు. ఆ ఖాళీ బాటిల్‌ను అక్కడ పడేసి.. ఆ తర్వాత తిన్నగా నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
కేంద్ర ప్రభుత్వ లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే, తెలంగాణాలో మాత్రం బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ మద్యం దుకాణాలు ప్రారంభానికి ముందే.. వైన్ షాపుల ఎదుట బారులు తీరిన పలువురు అమ్మాయిలు.. తమ స్థాయికి తోచిన రీతిలో మద్యాన్ని కొనుగోలుచేశారు.
 
మరోవైపు, వైన్స్‌ షాపుల వద్ద భౌతిక దూరం పాటించేలా హైదరాబాద్ నగర పోలీసులు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ హైదరాబాద్‌లోని పలు మద్యం దుకాణాల వద్ద పరిస్థితిని పరిశీలించారు. నారాయణగూడ శాంతి థియేటర్‌ దగ్గర ఉన్న ఓ మద్యం దుకాణాన్ని సందర్శించారు. 
 
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బుధవారం హైదరాబాద్‌లో 178 మద్యం షాపులు తెరిచారని చెప్పారు. ప్రతి వైన్స్‌ షాపు వద్ద భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించండం కోసం ప్రత్యేక మార్క్‌లు వేయించామని తెలిపారు. కంటైన్మెంట్‌ ప్రాంతాలలో పటిష్ట చర్యలు తీసుకున్నామని చెప్పారు.