1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 మే 2024 (09:29 IST)

ఆంధ్రప్రదేశ్‌లో విజయకేతనం ఎగురువేస్తాం... యూసీసీ అమలు తథ్యం : అమిత్ షా

amit shah
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయభేరీ మోగిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను ఏకంగా 17 స్థానాలను గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 17 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందన్నారు. అలాగే, దేశ వ్యాప్తంగా ఎన్డీయే కూటమి 400కుపైగా స్థానాల్లో విజయం సాధించబోతున్నట్టు చెప్పారు.
 
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలోనే కాకుండా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించబోతున్నట్టు పేర్కొన్నారు. ఒడిశాలో 16-17 స్థానాల్లో గెలువబోతున్నామని, ఏపీలో 17, పశ్చిమ బెంగాల్లో 24 నుంచి 32 స్థానాల వరకు ఎన్డీయే కూటమి గెలుచుకుంటుందని వివరించారు. తాము మూడోసారి అధికారం చేపట్టాక విస్తృత సంప్రదింపుల అనంతరం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేస్తామని చెప్పారు.
 
అగ్నిపథ్ పథకంపై వస్తున్న విమర్శలపై స్పందించిన షా.. దీనికి మించిన ఆకర్షణీయ పథకం మరోటి లేదని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ తెస్తామని చెబుతున్న ఏకీకృత వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)పై విమర్శలు గుప్పించారు. సంపన్నులు వాడే విలాస వస్తువులు, పేదలు వాడే సరకులపై ఒకే పన్ను తీసుకొస్తామనడాన్ని తప్పుబట్టారు. ఆర్టికల్-370 రద్దును చూపెడుతూ ఓట్లు అడగడం, యూసీసీని అమలు చేస్తామని చెప్పడం మత ఆధారిత ప్రచార కార్యకలాపాలే అయితే ఇకపైనా బీజేపీ అలాంటి ప్రచారమే చేస్తుందని తేల్చి చెప్పారు.
 
రాహుల్ గాంధీ వైఫల్యాన్ని కప్పి పుచ్చేందుకే పోలింగ్ విధానాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తోందని విమర్శించారు. వచ్చే రెండు మూడేళ్లలో నక్సలిజం అంతమైపోతుందన్న షా.. చత్తీస్‌గఢ్‌లో తప్ప మరెక్కడా నక్సల్స్ లేరని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్ వేర్పాటువాదులు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్‌‍లో పాల్గొనడం మోడీ ప్రభుత్వం సాధించిన విజయమని పేర్కొన్నారు. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సమయం వచ్చిందన్న షా.. ఇకపై వేసవిలో కాకుండా ఇంకో సమయంలో ఎన్నికలు నిర్వహించడంపై దృష్టి పెట్టనున్నట్టు వివరించారు.