1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 17 జూన్ 2024 (16:46 IST)

పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి శాపమే : సీఎం చంద్రబాబు

cmbabu
ఒక పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే, రాష్ట్రానికి శాపంగా మారుతుందని, ఇది జగన్మోహన్ రెడ్డి అక్షరాలా నిరూపించారని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన సోమవారం నుంచి కథన రంగంలోకి దిగిపోయారు. ఇందులోభాగంగా, సోమవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ఆ తర్వాత జలవనరుల శాఖ అధికారులతో కలిసి సమీక్ష చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం తాను పడిన కష్టాన్ని జగన్‌ బూడిదలో పోసిన పన్నీరు చేశారన్నారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించానని, ప్రాజెక్టు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురయ్యాయని చెప్పారు. జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చడంతో టీడీపీ హయాంలోనే 72 శాతం ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. 15 లక్షల క్యూసెక్కులు స్పిల్‌ వేపై డిశ్చార్జ్‌ అవుతాయని వెల్లడించారు. 
 
రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారని, వైకాపా ప్రభుత్వం రాగానే రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టారని ధ్వజమెత్తారు. ఏజెన్సీతోపాటు సిబ్బందినీ మార్చారు. డయాఫ్రమ్‌ వాల్‌ను గత ప్రభుత్వం కాపాడుకోలేదు. పోలవరం విషయంలో జగన్‌ క్షమించరాని తప్పులు చేశారని ఆక్రోశించారు.  ప్రాజెక్టుపై వందసార్లు సమీక్షించా.. 30 సార్లు సందర్శించానని, రూ.446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదన్నారు. 
 
సమాంతరంగా డయాఫ్రమ్‌ వాల్‌ కడితే రూ.990 కోట్లు ఖర్చవుతుంది. గతంలో ప్రాజెక్టు కొనసాగి ఉంటే 2020 చివరినాటికి పూర్తయ్యేది. పోలవరం పూర్తికి నాలుగు సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారు. అన్నీ సవ్యంగా జరిగితేనే నాలుగేళ్లు పడుతుందని అధికారులు అంటున్నారు అని చంద్రబాబు వివరించారు.