1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By కుమార్ దళవాయి
Last Modified: శుక్రవారం, 31 మే 2019 (20:26 IST)

దటీజ్ సీఎం జగన్... అప్పుడే మొదలెట్టేశారుగా...

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పొదుపు సూత్రాన్ని పాటిస్తున్నారు. లోటు బడ్జెట్‌ కారణంగా తానే అందరికి ఆదర్శంగా నిలవాలని భావిస్తున్నారు. తిరుగులేని మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి హంగుఆర్భాటాలకు పోకుండా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చాలా తక్కువ ఖర్చుతో పూర్తి చేశారు. అది మాత్రమే కాకుండా ఇక నుండి ప్రభుత్వం తరపున జరిగే ఏ కార్యక్రమానికైనా వీలైనంత వరకు ఖర్చులు తగ్గిస్తానని చెబుతున్నారు.
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకార మహోత్సవాన్ని అత్యంత నిరాడంబరంగా నిర్వహిస్తానని చెప్పిన జగన్ చెప్పినట్లుగానే మాట నిలబెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి పెట్టిన ఖర్చు అక్షరాలా 29 లక్షల పదివేల రూపాయలు. కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ స్థలమైన ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించడం, వీలైనంత వరకు ప్రభుత్వ వనరులను ఉపయోగించుకోవడం ద్వారా ఖర్చు భారీగా తగ్గించినట్లు అధికారులు వెల్లడించారు. 
 
2014లో టీడీపీ విజయం తర్వాత అప్పటి సీఎంగా ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు కోటిన్నర రూపాయలు ఖర్చు చేశారు. వాస్తవానికి ప్రభుత్వంలో ఆర్ధిక క్రమశిక్షణ లేకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తప్పవని భావిస్తున్న ప్రభుత్వం ఆర్ధిక శాఖలో కీలక అధికారుల నియామకంపై దృష్టి సారిస్తోంది. ఆ లోపు నిర్వహించే ప్రతీ ప్రభుత్వ కార్యక్రమాన్ని, చివరికి ప్రెస్ మీట్లను సైతం తక్కువ ఖర్చుతోనే నిర్వహించేలా ప్రభుత్వం అంతర్గతంగా ఆదేశాలు ఇస్తోంది.