గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (20:13 IST)

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి జగన్ సర్కారు నోటీసు

andhrapradesh logo
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంఘానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారు నోటీసు జారీ చేసింది. సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో చెప్పాలంటూ ఈ షోకాజ్ నోటీసులో పేర్కొంది. 
 
ఇటీవల ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు గవర్నర్ హరిచందన్‌ను కలిసి తమ సమస్యలను నివేదించారు. వేతనాలు ఒకటో తేదీనే ఇచ్చేలా ఒక చట్టాన్ని చేయాలంటూ కోరారు. ఇలాగే, ఇతర సమస్యలపై కూడా ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఈ చర్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసు జారీచేసింది. 
 
సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో చెప్పాలంటూ ఈ షోకాజ్ నోటీసులు పేర్కొంది. గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం "రోసా నిబంధన"లకు విరుద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పైగా, మీడియాలో వచ్చిన వార్తా కథనాల ఆధారంగా ఈ నోటీసులు జారీచేసినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 
 
కాగా, ఉద్యోగులు వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే మార్గం ఉందని తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నపుడు గవర్నర్‌ను ఎందుకు కలవాల్సి వచ్చిందని ప్రభుత్వ పెద్దలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.