శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2020 (10:16 IST)

పొరుగు రాష్ట్రాల మద్యానికి చెక్ : చట్ట సవరణ చేయనున్న ఏపీ

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకునే వెసులుబాటు ఉంది. దీంతో అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని విచ్చలవిడిగా తెచ్చుకుంటున్నారు. ఫలితంగా రాష్ట్రంలో మద్యం విక్రయాలు తగ్గిపోతున్నాయి. దీంతో ఆదాయానికి గండిపడుతోంది. దీనికి చెక్ పెట్టాలని ఏపీ సర్కారు భావిస్తోంది. ఇందులోభాగంగా, ఇతర రాష్ట్రాల నుంచి ప్రస్తుతం అనుమతిస్తున్నట్టుగా మూడు మద్యం సీసాలను కూడా అనుమతించకుండా చట్ట సవరణ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 
 
ఈ మేరకు ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. గతంలో ప్రతి వ్యక్తి వద్దా మూడు సీసాల వరకూ నిల్వ ఉంచుకునేందుకు అనుమతులు అవసరం లేదని ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆపై తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తున్న వారిలో అత్యధికులు మూడేసి సీసాల చొప్పున మద్యం తెచ్చుకుంటున్నారు. 
 
వీరిపై స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో, కేసులు పెట్టగా, ప్రభుత్వమే గరిష్టంగా మూడు మద్యం సీసాలను ఉంచుకోవచ్చని స్పష్టం చేసిన వేళ, అది ఏ రాష్ట్రం నుంచి తెచ్చుకున్నా నేరం కాబోదని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఓ కేసును విచారించిన ధర్మాసనం, ఎక్కడ కొనుగోలు చేసైనా పౌరులు మూడు సీసాలను తెచ్చుకోవచ్చని తేల్చింది.
 
ఈ తీర్పు తర్వాత, ఇతర రాష్ట్రాల నుంచి స్వల్ప మొత్తంలో మద్యం తీసుకుని ఏపీకి వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పక్క రాష్ట్రాల్లో తక్కువ ధరకు మద్యం కొని, ఇళ్లల్లో నిల్వ ఉంచుకుని, వ్యాపారం సాగిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిందని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. 
 
దీంతో మూడు సీసాల నిబంధనను మారుస్తూ చట్ట సవరణ చేయాలని, పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకునే మద్యంపై అదనపు పన్నులను వేసి, ధరలను సమానం చేయాలని అధికారులు ప్రతిపాదించారు. దీనిపై జగన్ సర్కారు అతి త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.