శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 7 జనవరి 2019 (12:29 IST)

పోలవరంలో ఏం చేశారు.. ఎందుకు గిన్నిస్ రికార్డులో చోటు?

పోలవరంలో మరో చరిత్రను లిఖించారు. కాంక్రీట్ మహాయజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తిచేశారు. దీంతో గిన్నిస్ రికార్డును కైవసం చేసుకున్నారు. ఫలితంగా ఇప్పటివరకు వరకు గిన్నిస్ రికార్డుగా ఉన్న దుబాయ్ కాంక్రీటు రికార్డు తుడిచిపెట్టుకునిపోయింది. 
 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కాంక్రీట్ నిర్మాణ పనులను చేపట్టారు. ఆదివారం అర్థరాత్రికే 22,045 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులను నవయుగ ఇంజనీరింగ్ సంస్థ పూర్తిచేసింది. ఈ కారణంగా గిన్నిస్ బుక్ రికార్డును సాధించింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తంచేశారు. నవయుగ కంపెనీ ఎండీ శ్రీధర్‌ను సీఎం చంద్రబాబు ప్రశంసలవర్షంలో ముంచెత్తారు. 
 
మొత్తం 24 గంటల వ్యవధిలో ఏకంగా 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తిచేశారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ ఆధ్వరంలో జరిగిన ఈ పనులు గంటకు సగటున 1,300 ఘనపు మీటర్ల నుంచి 1,400 ఘనపు మీటర్ల వరకూ సాగాయి. ఆదివాదం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కాంక్రీట్ పనులు.. సోమవారం సరిగ్గా ఉదయం 8 గంటలకు ముగిశాయి.
 
ఈ కాంక్రీటు పనులను 24 మంది ప్రొఫెసర్లతో పాటు ప్రతి రెండు గంటలకోసారి గిన్నిస్ ప్రతినిధి పర్యవేక్షించారు. ఒకేరోజు ఇంత భారీ స్థాయిలో ఎక్కడ కూడా కాంక్రీట్ పనులు సాగలేదని ఆ ప్రతినిధి చెప్పారు. దీంతో పోలవరం ప్రాజెక్టు సరికొత్త రికార్డును సృష్టించినట్టు తెలిపారు. కాగా, గతంలో యూఏఈకి చెందిన ఆర్ఏఎల్ఎస్ కన్సెల్టింగ్ సంస్థ 24 గంటల వ్యవధిలో 21580 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేసిన విషయం తెల్సిందే. ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ఈ రికార్డును బద్ధలుకొట్టింది.