1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (16:13 IST)

చిరంజీవి వంటి బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చారు: పవన్ కళ్యాణ్

నాడు ప్రజారాజ్యం పార్టీలో చేరిన పలువురు నేతలు పదవీ వ్యామోహంతో చిరంజీవి వంటి బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చారని సినీ నటుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 సీట్లలో పోటీ చేస్తామని ఆయన స్పష్టంచేశారు.
 
గత మూడు రోజులుగా ఆయన జిల్లా వారీగా సమీక్షలు నిర్వహించారు. ఇందులోభాగంగా శనివారం ప్రకాశం జిల్లాలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, తన అన్న చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
తాను ప్రతికూల పరిస్థితుల్లోనే రాజకీయ పార్టీని స్థాపించినట్టు చెప్పారు. తాను పార్టీని స్థాపించే సమయంలో తమ పార్టీలో బలమైన నేత ఎవరూ లేరని గుర్తుచేశారు. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 175 సీట్లలో పోటీ చేస్తుందని, ఇందులో 60 శాతం టిక్కెట్లను కొత్తవారికే కేటాయిస్తామని ప్రకటించారు. సమతుల్యత కోసమే అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. 
 
ఇపుడు రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ.2 వేల కోట్లు అవసరమని అంటున్నారు. కానీ, రాజకీయాల్లో పోటీ చేయాలంటే డబ్బు అక్కర్లేదన్నారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించాలని చిరంజీవికి ప్రేరణ కల్పించిన వారిలో తానూ ఒకడినని చెప్పారు. 
 
పీఆర్పీ ఉండివుంటే సామాజిక న్యాయం జరిగివుండేదన్నారు. అలాగే, ఆ పార్టీలో చేరిన అనేక మంది సీనియర్ నేతలు పదవీ వ్యామోహంతో చిరంజీవి వంటి బలమైన వ్యక్తిని సైతం బలహీనుడిగా మార్చేశారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.