1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (09:23 IST)

రుణాంధ్ర ప్రదేశ్‌గా నవ్యాంధ్ర - ఒకే నెలలో రూ.12 వేల కోట్లు అప్పు

andhra pradesh debt
నవ్యాంధ్ర ప్రదేశ్ రుణాంధ్రప్రదేశ్‌గా మారిపోతోంది. అధికార వైకాపా ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేస్తుంది. గత మూడేళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా అప్పు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ యేడాది ఒక్క జనవరి నెలలోనే రూ.12 వేల కోట్లకు పైగా అప్పును సమీకరించింది. కేంద్ర ఆర్థిక శాఖ చివరి మూడు నెలలకు ఇచ్చిన అప్పుల పరిమితిని ఒకే నెలలో వాడుసేకుంది. 
 
మంగళవారం భారత రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో ఏపీ ప్రభుత్వం రెండు రూపాల్లో ఈ మొత్తాన్ని వాడేసుకుంది. రూ.1000 కోట్లను 13 యేళ్ల కాల పరిమితతో తిరిగి చెల్లించేలా తీసుకుంది. దీనికి 7.71 శాతం వడ్డీగా నిర్ణయించారు. ఆ తర్వాత మరో తొమ్మిదేళ్ల కాల పరిమితితో మరో రూ.557 కోట్లను తీసుకుంది. దీనికి 7.66 శాతంగా వడ్డీని నిర్ణయించారు. మంగళవారం నాటి రుణంతో ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి జనవరి నెలలోనే రూ.4557 కోట్ల రుణం తీసుకున్నట్టు అయింది.
 
కొత్త రుణానికి జనవరి మొదటివారంలో కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మొత్తాన్ని నెలాఖరు నాటికి తెచ్చి వాడుకోవాల్సిన గడ్డు పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వం రుణాలు తీసుకుంది. వీటి రూపంలో మరో 5 వేల కోట్లు ఖజానాకు చేరాయి. ఇవికాకుండా మరో కార్పొరేషన్‌కు సంబంధించి తీసుకున్న రుణం రూ.2700 కోట్లు కూడా ఖజానాకు చేరినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో జనవరి నెలలో ఏకంగా రూ.12 వేల కోట్ల రుణాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ స్థాయిలో రుణాలు తీసుకున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ఓవర్‌డ్రాఫ్టులోనే ఉంది.