1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 9 నవంబరు 2022 (12:46 IST)

దేశ ఆర్థిక గతిని మార్చిన మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్ : నితిన్ గడ్కరీ

nitin gadkari
కేంద్ర జాతీయ రహదారుల శాఖామంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ ఇటీవలి కాలంలో సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని వాస్తవాలను వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా, గత యూపీఏ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్థరణలు దేశ ప్రగతికి ఏ విధంగా దోహదపడుతున్నాయో కుండబద్ధలు కొట్టినట్టు చెబుతున్నారు. తాజాగా మాజీ ప్రధాని, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. 
 
దేశ ఆర్థిక గతిని మార్చిన మేధావి మన్మోహన్ సింగ్ అని, దేశం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుందని కొనియాడారు. "ట్యాక్స్ ఇండియా ఆన్‌లైన్ అవార్డు 2022" కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. 
 
దేశంలో గత 1991లో అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు చేపట్టారని తెలిపారు. ఆయన చేపట్టిన చర్యలతో దేశ ఆర్థిక వ్యవస్థ సరికొత్త మార్గంలో పయనించి, భారత్ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు దోహదపడిందని గడ్కరీ ప్రశంసించారు. 
 
1990 దశం మధ్యలో తాను మహారాష్ట్ర మంత్రిగా ఉన్నపుడు రోడ్లు వేయడానికి నిధులు సమీకరించగలిగానని, ఇది మన్మోహన్ చేపట్టిన ఆర్థిక సంస్కరణ ఫలితమేనని చెప్పారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 26 గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌ వేలను కేంద్రం నిర్మిస్తుందన్నారు. తమకు నిధుల కొరత లేదని చెప్పారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఆదాయం యేడాదికి రూ.40 వేల కోట్లుగా ఉందని ఇది 2024 ఆఖరు నాటికి రూ.1.40 కోట్లకు చేరుకుంటుందని మంత్రి గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.