మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 21 డిశెంబరు 2019 (11:04 IST)

దిశ చట్టం అమ‌లుకు ప్ర‌త్యేక కోర్టులు ఏర్పాటు : నీలం సాహ్ని

దిశ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసే ప్రక్రియలో భాగంగా త్వరలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం అమరావతి సచివాలయంలో దిశ చట్టం అమలు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు విషయమై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. 
 
ఈ సదంర్భంగా సిఎస్ మాట్లాడుతూ దిశ చట్టానికి సంబంధించి ప్రత్యేక కోర్టులు ఏర్పాటుకు కావాల్సిన సౌకర్యాలు, ఇతర అవసరాలకు సంబంధించి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి అందించాలని న్యాయశాఖ కార్యదర్శి తదితర అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఫోరెన్సిక్ ల్యాబ్‌లను మరింత పటిష్టవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి మరిన్ని నిధులు రాబట్టుకొనే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
 
దిశ లాంటి సంఘటనలు జరిగినపుడు సకాలంలో బాధితుల నుండి శాంపిల్స్ తీసుకుని పరీక్షించి సకాలంలో నివేదికలు అందించే విధంగా డాక్టర్లు తదితర సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆదిశగా తగిన చర్యల తీసుకోవాలని సిఎస్ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. 
 
జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాలను మరింత మెరుగు పర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. దీనిపై వైద్య ఆరోగ్యం, స్త్రీశిశు సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు వచ్చే 23వ తేదీ సోమవారం ఆయా ఆసుపత్రుల వైద్యాధికారులు, స్త్రీశిశు సంక్షేమ శాఖలతో వీడియో సమావేశం నిర్వహించి అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని చెప్పారు. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఒన్ స్టాప్ సెంటర్లను మరింత పటిష్టవంతగా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారులను సిఎస్ నీలం సాహ్ని ఆదేశించారు. అత్యాచారాలు, వేధింపులకు తదితర వాటికి గురైన బాధిత మహిళలకు సత్వర న్యాయ మరియు వైద్య సేవలు అందించుట ద్వారా తాత్కాలిక వసతి సౌకర్యం కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్న ఈ ఒన్ స్టాప్ కేంద్రాలను అన్నివిధాలా మరింత పటిష్టవంతంగా పనిచేసే విధంగా ఈ కేంద్రాలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సిఎస్ పేర్కొన్నారు. 
 
సమావేశంలో న్యాయశాఖ కార్యదర్శి జి.మెహన్ రెడ్డి మాట్లాడుతూ దిశ చట్టం అమలుకు సంబంధించి ప్రత్యేక కోర్టులు ఏర్పాటుపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుండి ఆదేశాలు వస్తాయని ఆ ఆదేశాలువచ్చిన వెంటనే ఈ కోర్టులు ఏర్పాటుకు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని వివరించారు.ఈలోగా 13 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కోర్టులకు సంబంధించిన ఏర్పాట్ల ప్రక్రియ కావాల్సిన వసతులు తదితర ప్రతిపాదనలను సిద్ధం చేయడం జరుగుతుందని చెప్పారు. 
 
ఈ సమావేశంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ, మహిళా శిశు సంక్షేమం, హోం శాఖల ముఖ్య కార్యదర్శులు ప్రవీణ్‌ప్రకాశ్, కెఆర్ఎం కిషోర్‌కుమార్, శాంతి భద్రతల అదనపు డిజిపి రవిశంకర్ అయ్యన్నార్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలు కృతికా శుక్లా, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బి.రామ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.