శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 28 డిశెంబరు 2021 (18:44 IST)

ఆంధ్ర రాష్ట్రాన్నిప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీగా మార్చేసిన జ‌గ‌న్

ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్‌ తన ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీగా భావిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి విమర్శించారు. భాజపా ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రజా ఆగ్రహ సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భావితరాలకు ఏమీ మిగలదన్నారు. 
 
 
కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో గుంజుకుంటున్నారని ఆరోపించారు. ‘‘మద్యం ధరలు 150 శాతం పెంచారు. పెట్రోల్‌ ధరలు అన్ని రాష్ట్రాల్లో కంటే ఇక్కడే అధికంగా ఉన్నాయి. సినిమా రంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. 30 నెలలుగా ప్రజలు దుర్మార్గపాలన అనుభవిస్తున్నారు. ఏపీలో ఇంత వరకు భాజపా పాలన చూడలేదు. రాష్ట్రం అప్పుల ఊబిలో పూర్తిగా కూరుకుపోయింద‌న్నారు.
 
 
కనిపించే అప్పుల కంటే, కనిపించని అప్పులే ఎక్కువ. విశాఖ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏపీలో కబ్జా అంటే ఏమిటో తెలియజేశారు. కేంద్ర సాయం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటా చెల్లించాలి, కానీ రాష్ట్రం నుంచి తగిన సాయం ఇవ్వడంలేదు. పోలీసులను వైకాపా తమ కార్యకర్తలుగా వాడుకుంటోంది. 30 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.. వైకాపా ఓడ తప్పకుండా మునిగిపోతుంది. భాజపాను వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తేవాలి అని సుజనాచౌదరి అన్నారు.