మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 17 జనవరి 2022 (15:58 IST)

జగన్‌ పాలనలో అమ్మకానికి ఆంధ్రప్రదేశ్‌...

ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం, ఆర్థిక ఆరాచకత్వం వల్ల జగన్‌ పాలనలో అమ్మకానికి ఆంధ్రప్రదేశ్‌ ఉన్నట్లు పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి  ఎద్దేవా చేశారు. జనవరి 17వ తేది వచ్చిన ఇంకా పది శాతం మంది ఉద్యోగులకు జీతాలు, 50 శాతం మంది విశ్రాంతి ఉద్యోగులకు పింఛన్‌ డబ్బులు వేయకపోవడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దంపడుతుందని చెప్పారు. 
 
 
జగన్‌ ప్రభుత్వం ఐపి (దివాలా) వైపు అడుగులు వేస్తుందని తుల‌సీరెడ్డి అచ‌నా వేశారు. విశ్రాంతి ఉద్యోగులకు 7 నెలలుగా రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వలేదని చెప్పారు. 5 డిఎలు పెండింగ్‌ లో ఉన్నాయన్నారు. జనవరి 10 న నంద్యాల్లో ప్రారంభించాల్సిన ఈబిసి నేస్తం డబ్బు లేక వాయిదా పడిందని చెప్పారు. రోడ్లు భూలోకంలో యమలోకం చూపిస్తున్నట్లు ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనడానికి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. తమ పెండింగ్‌ బిల్లులు చెల్లించి ప్రాణాలు కాపాడాలని కాంట్రాక్టర్లు భిక్షాటన చేయడం రాష్ట్ర ఆర్థిక దుస్థితికి నిలువుటద్దం అని ఆరోపించారు. 
 
 
రాష్ట్ర ప్రభుత్వం తన వాటా డబ్బులు చెల్లించకపోవడంతో కడప-మదనపల్లె - బెంగళూరు రైల్వే లైన్‌ నిర్మాణం పనులను రైల్వే శాఖ నిలిపివేసిందని చెప్పారు. వైఎస్‌ఆర్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పనులు, పులివెందుల వైద్య కళాశాల పనులు నిలిచిపోయాయని అన్నారు. హాస్టళ్లలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయన్నారు. డ్వాక్రా యానిమేటర్లకు 6 నెలలుగా జీతాలు లేవని ఆరోపించారు. హరిత రాయబారులకు రెండేళ్లుగా జీతాలు లేని కారణంగా సంపద కేంద్రాలు దరిద్ర కేంద్రాలుగా మారినట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు అధ్వానంగా ఉన్నాయని, సాక్షాత్తు కాగ్‌ జగన్‌ పాలనపై అక్షింతలు వేసిందని దుయ్యబట్టారు. 
 
 
రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నారు. ప్రజలపై పన్నుల భారం పెరిగినట్లు చెప్పారు. ఇప్పటికైనా ఆర్థిక అరాచకత్వానికి జగన్‌ ప్రభుత్వం స్వస్తి పలకాలని సూచించారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని లేకుంటే ఆర్టికల్‌ 360 ప్రకారం భారత రాష్ట్రపతి రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే ప్రమాదం ఉందని తులసిరెడ్డి హెచ్చరించారు.