1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 డిశెంబరు 2021 (11:56 IST)

గాంధీ భవన్‌కు రోశయ్య పార్థివదేహం.. చిరంజీవి - నేతలు నివాళులు

అనారోగ్య కారణంగా మృతి చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ఆదివారం జరుగనున్నాయి. దేవరయాంజల్‌లో ఉన్న ఆయన ఫామ్‌హౌస్‌లో ఈ అంత్యక్రియలు పూర్తిచేయనున్నారు. 
 
ఇందులోభాగంగా, రోశయ్య పార్థివదేహాన్ని ఆదివారం ఉదయం ఇంటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీ భవన్‌కు తరలించారు. అక్కడ కొద్దిసేపు ఉంచుతారు. ఆ తర్వాత అంతిమయాత్ర ప్రారంభమై, దేవరయాంజల్‌లోని ఆయన ఫామ్‌హౌస్‌లో పూర్తి చేస్తారు. 
 
ఇదిలావుంటే, రోశయ్య పార్థివదేహాన్నికి కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి, సినీ హీరో చిరంజీవి ఆదివారం నివాళులు అర్పించారు. అలాగే, అనేక మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, ప్రముఖులు రోశయ్యను చివరిచూపు చూశారు. 
 
ఇదిలావుంటే, శనివారం ఉదయం ఆయన తన నివాసంలోనే తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. రక్తపోటు స్థాయి ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే మార్గంలోనే చనిపోయారు. 
 
కాగా, కె.రోశయ్య అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన కొంపల్లిలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ముందుగా ఆయన పార్థివదేహాన్ని సోమవారం ఉదయం 11 గంటలకు గాంధీ భవన్‌కు తరలించి అక్కడ కొద్దిసేపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సందర్శనార్థం ఉంచుతారు. 
 
ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి రోశయ్య అంతిమయాత్ర మొదలై 1.30 గంటల ప్రాంతంలో ఆయన అంత్యక్రియలను పూర్తిచేస్తారు. ఏపీ ప్రభుత్వం తరపున మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు ఈ అంత్యక్రియలకు హాజరుకానున్నారు.