ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (19:28 IST)

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యంపై ఏపీ ఫిల్మ్ ఛాంబర్ హ‌ర్షం..

కరోనా మ‌హ‌మ్మారి కారణంగా సినిమా థియేటర్లు మూతపడిపోయి ఇబ్బంది పడుతున్న తెలుగు చిత్ర పరిశ్రమకు చేయూత నివ్వాల‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌ రెడ్డికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫిలిం ఛాంబ‌ర్స్ ఆఫ్ కామ‌ర్స్ వ్య‌వ‌స్థాపక‌ అధ్య‌క్షులు వాసిరెడ్డి భూపాల్ ప్ర‌సాద్‌, అధ్య‌క్షులు అంబ‌టి మ‌ధుమోహ‌న కృష్ణ విజ్ఞ‌ప్తి చేశారు. 
 
ఈ మేర‌కు శుక్ర‌వారం విజ‌య‌వాడ మ‌హాత్మాగాంధీ రోడ్డులోని ఓ హోట‌ల్‌లో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో వాసిరెడ్డి భూపాల్ ప్ర‌సాద్‌, అంబ‌టి మ‌ధుమోహ‌నకృష్ణ మాట్లాడుతూ ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబందించి థియేటర్ యాజమాన్యాలు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్ కరెంట్ చార్జీలను పూర్తిగా రద్దు చేస్తూ, మిగిలిన 6 నెలల ఫిక్స్‌డ్ కరెంట్ చార్జీలను వాయిదాలలో చెల్లించుటకు అనుమతినిస్తూ, ఏ.బి.సెంటర్స్ తీసుకున్న రూ.10 లక్షలు, సి సెంటర్స్ వారు తీసుకున్నరూ.5 లక్షలు రూణాలపై ఉన్న వడ్డీని 50శాతం మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవ‌డం శుభ‌ప‌రిణామం అన్నారు. 
 
ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో చిత్ర పరిశ్రమకు చెందిన వేలాది మందికి ప్రయోజనం చేకురిందని తెలిపారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు చెందిన ప‌లువురు, ముఖ్యంగా సినీ ప్రదర్శనదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నార‌ని పేర్కొన్నారు. 
 
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి, సహకరించిన సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ మంత్రి పెర్ని నానీకి, ప్ర‌ముఖ సినీ న‌టులు చిరంజీవి, అక్కినేని నాగార్జునకు, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయచందర్‌, మేనేజింగ్ డైరెక్టర్ విజయకుమార్ రెడ్డికి కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ త‌ర‌ఫున కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.