1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (21:30 IST)

పీఆర్సీ రగడ : సంప్రదింపులకు సర్కారువారి కమిటీ - ఫిబ్రవరి 7 నుంచి సమ్మె

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ పై ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమబట్టారు. వీరిని చల్లార్చేందుకు, వారితో సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి పీఆర్సీ వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకునిరానుంది. 
 
ఇటీవల ఏపీ సర్కారు ఫిట్మెంట్, పీఆర్సీలను ప్రకటించింది. వీటి కారణంగా వేతనం పెరగకుండా తగ్గిపోయింది. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. నాలుగు ప్రధాన ఉద్యోగ సంఘాలు ఉమ్మడిగా ఐక్య కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. సమ్మెకు సైతం వెనుకాడబోమని ప్రకటించారు. 
 
దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. శుక్రవారం అత్యవసరంగా సమావేమైన ఏపీ మంత్రిమండలి ఉద్యోగుల ఆందోళనపై చర్చించింది. చివరగా ఉద్యోగులతో సంప్రదింపులు జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీని మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మలతో ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో సంప్రదింపులు జరిపి ఓ నిర్ణయం తీసుకుంటాయి.
 
మరోవైపు, ఉద్యోగ సంఘాల నేతలు కూడా శుక్రవారం సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. ఇందులో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సీఎస్‌ను కలిసి సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు.