మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 24 నవంబరు 2022 (17:29 IST)

ఇప్పటం గ్రామస్థులపై హైకోర్టు సీరియస్ - రూ.లక్ష చొప్పున అపరాధం

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామస్తులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ గ్రామంలో రోడ్డు విస్తరణల పేరుతో పలు గృహాలను కూల్చివేశారు. ఇది పెద్ద వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వారికి ఊహించని విధంగా షాక్ తగిలింది. 
 
ఇప్పటం గ్రామంలో కూల్చివేతలకు సంబంధించి ముందుగా నోటీసులు ఇచ్చినా.. నోటీసులు ఇవ్వలేదంటూ బాధితులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపైనే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారంటూ మండిపడింది. ఈ క్రమంలో ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. 
 
ఈ కేసులో హైకోర్టు గతంలో స్టే ఇవ్వగా, గురువారం ఇరు వర్గాల వాదనలు ఆలకించింది. ఇళ్ల కూల్చివేతలపై తమకు ప్రభుత్వం ముందస్తు నోటీసులు ఇవ్వలేదని పిటిషన్‌దారులు పేర్కొనగా, నోటీసులు ఇచ్చిన తర్వాతే ఆక్రమణలను కూల్చివేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపాపారు. 
 
ఈ సందర్భంగా నోటీసులు ఇచ్చింది నిజమేనని హైకోర్టు గుర్తించడంతో ఇప్పటం గ్రామస్థులకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో తప్పుడు సమాచారం ఇచ్చి మధ్యంతర ఉత్తర్వులు తీసకున్నారంటూ ఆరోపించింది. మొత్తం 14 మంది పిటిషన్‌దారులకు హైకోర్టు రూ.లక్ష చొప్పున అపరాధం విధించింది.