బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (16:51 IST)

ఏపీలో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు ... నోటిఫికేషన్ జారీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరోమారు స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. మిగిలిపోయిన గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు మూడో దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. 
 
ఇందులోభాగంగా, నవంబరు 3 నుంచి 5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 14 న పంచాయతీ ఎన్నికల పోలింగ్, నవంబర్ 15 మున్సిపల్ పోలింగ్, నవంబర్ 16 ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ఉంటుంది. నెల్లూరు కార్పొరేషన్‌, 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయి. అందులో కుప్పం కూడా ఉండటం గమనార్హం. 
 
స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే, 15న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలోని నెల్లూరు కార్పొరేషన్‌తో పాటూ.. మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో కృష్ణాజిల్లాలోని ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి ఉన్నాయి. 
 
గుంటూరు జిల్లాలో దాచేపల్లి, గురజాల, ప్రకాశం జిల్లాలో దర్శి, నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డి పాలెం, చిత్తూరు జిల్లాలో కుప్పంలో ఎన్నికలు జరుగుతాయి. కడప జిల్లాలో కమలాపురం, రాజంపేట, అనంతపురం జిల్లాలో పెనుకొండలో ఎన్నికలు జరుగుతాయి.
 
ఈ నెల 14న పంచాయతీ పోలింగ్.. అదే రోజు కౌంటింగ్
ఈ నెల 15న మున్సిపల్ ఎన్నికల పోలింగ్..17 న కౌంటింగ్
ఈ నెల 16న ఎంపిటిసి, జెడ్పీటీసీ పోలింగ్..18 కౌంటింగ్