సోమవారం, 23 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 సెప్టెంబరు 2024 (17:02 IST)

సీఎం చంద్రబాబు వంద రోజుల పాలనకు ఆకర్షితులవుతున్నారు : మంత్రి నారాయణ

narayanap
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంద రోజుల పాలనకు అనేక మంది ఆకర్షితులవుతూ ఆ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఛైర్‌పర్సన్‌తో పాటు మరో ఏడుగురు వైకాపా కౌన్సిలర్లు తెదేపాలో చేరారు. 
 
టీడీపీ విధానాలు నచ్చి, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ అభివృద్ధి కోసం తాము తెదేపాలో చేరామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. అందరికి సహకారంతో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. గత వైకాపా ప్రభుత్వం స్థానిక సంస్థల నిధులను దారి మళ్లించడంతో అభివృద్ధి జరగలేదని మంత్రి నారాయణ అన్నారు. 
 
నిధుల లేమితో అభివృద్ధికి నోచుకోని నగర పంచాయతీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1.42 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేలా మరిన్ని నిధులు విడుదల చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. గెలిపించిన ప్రజలకు మంచి చేయాలనే టీడీపీలో చేరుతున్నారన్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చే నిధులను జగన్‌ రాబట్టలేకపోయారని నారాయణ విమర్శించారు.