1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (15:48 IST)

కోర్టు ఆదేశాలు వచ్చాక నిమ్మగడ్డ రెచ్చిపోతున్నారు.. చంద్రబాబు తొత్తుగా మారిపోయారు...

స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఏపీ ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెచ్చిపోతున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఇదే అశంపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను ఎలా విడుదల చేస్తారంటూ మండిపడ్డారు. 
 
పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతాయని... అలాంటప్పుడు మేనిఫెస్టోను విడుదల చేసే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారన్నారు. సొంత జిల్లాలో కూడా మెజారిటీ తెచ్చుకోలేని నేత చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. 
 
చంద్రబాబు ఏనాడు ప్రజల కోసం పని చేయలేదని విమర్శించారు. ప్రజల కోసం నిస్వార్థంగా పని చేసిన వ్యక్తి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని... పులివెందులలో ఒక్క రూపాయికే ఆయన వైద్యం అందించారని గుర్తుచేశారు. వైయస్ గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదని అన్నారు.
 
ఇకపోతే, ప్రభుత్వ అధికారులను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నిలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఆయన ఇష్టానుసారం ఆదేశాలను జారీ చేస్తున్నారని ఆరోపించారు. 
 
చంద్రబాబు అనుచరుడిగా పని చేస్తున్నారని అన్నారు. కరోనా ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలను తాము గౌరవిస్తున్నామని చెప్పారు. ఏకగ్రీవ ఎన్నికల ఆనవాయతీ 2002 నుంచి వస్తోందని అన్నారు. పైగా, తనకు బలం ఉండటం వల్లే తాను నిలబెట్టిన అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధిస్తున్నారని మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు.