1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 డిశెంబరు 2021 (18:54 IST)

కట్ట తెగిన అన్నమయ్య ప్రాజెక్ట్.. కేంద్రమంత్రి ఫైర్.. అనిల్ వివరణ

అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవటంతో భారీ ప్రాణ నష్టం జరిగిందని కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. వరదల కారణంగా కడప జిల్లాల్లో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. 
 
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ రాజ్యసభలో మాట్లాడుతూ.. అన్నమయ్య ప్రాజెక్టు నష్టానికి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది కాదా అంటూ ప్రశ్నించారు. 
 
దేశంలో ఆనకట్టల భద్రతకు బిల్లును ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకతను ఈ ప్రమాదం సూచిస్తోందన్నారు. రాజ్యసభలో ఆనకట్టల భద్రత బిల్లుపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు.
 
భారత్‌లో ఇలా మరో ఆనకట్ట కూలిందని చర్చించుకుని.. దీనిని ఓ కేస్‌ స్టడీలా తీసుకోవడమంటే.. అది యావజ్జాతికే తలవంపులు తెచ్చే విషయం కాదా..అంటూ కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యల పైన ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలు అవగాహన లేకుండా చేసినట్లు ఉన్నవని చెప్పారు.
 
ప్రాజెక్టు గేట్ల కెపాసిటీకి మించి హఠాత్తుగా వచ్చిన వరదతోనే అన్నమయ్య ప్రాజెక్టు వద్ద అనూహ్యంగా వరద కట్టలు తెంచుకుందని వివరించారు. ఇటువంటి సంఘటనే ఉత్తరాఖండ్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన విషయం అందరికీ తెల్సిందేనన్నారు.
 
అందులో 150 మంది జల సమాధి అయ్యారని గుర్తు చేసారు. అక్కడ అధికారంలో ఉన్నది బీజేపీ కావటంతోనే, నిజాల్ని దాచే ప్రయత్నం చేశారని విమర్శించారు.