శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 31 మార్చి 2021 (21:06 IST)

బండారు సత్యనారాయణ మూర్తి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే కేసు పెడతాం

తలనీలాల రవాణాకు సంబంధించి వాస్తవాలు తెలుసుకోకుండా మాజీ ఎమ్మెల్యే శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి టిటిడి ధర్మకర్తల మండలి, ఈవో, అదనపు ఈవోలపై ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంపై టీటీడీ తీవ్ర అభ్యంతరం తెలియజేస్తోంది.
 
ఈ విషయంలో ఏమాత్రం సంబంధం లేని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం పై టీటీడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
 
 మిజోరం రాష్ట్రంలో పట్టుబడిన తలనీలాలు టిటిడికి సంబంధించినవి కావని మంగళవారం ఉదయం ప్రకటన విడుదల చేశాము. నిన్న సాయంత్రం అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి మీడియాసమావేశం పెట్టి వాస్తవాలు వెల్లడించారు.
 
బుధవారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కస్టమ్స్, అస్సాం రైఫిల్స్ అధికారులు పోలీసులకు ఇచ్చిన నివేదికను మీడియాకు అందజేయడం జరిగింది. అందులో ఎక్కడా టిటిడి పేరు లేని విషయాన్ని, పట్టుబడ్డ తలనీలాలు మిజోరంలో స్థానికంగా సేకరించారనే విషయాలను బయట పెట్టాము.

టిటిడిలో ప్రస్తుతం ఉన్న తలనీలాల ప్రాసెసింగ్ విధానం కొత్తగా ఏర్పాటు చేసింది కాదు.  కొన్ని దశాబ్దాల నుంచి  ఈ విధానం ఉంది. ఈ విధంగా ప్రాసెస్ చేసిన తలనీలాలను వివిధ గ్రేడ్లుగా విభజించి వేలం వేయడం అనే ప్రక్రియ ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది.
 
మిజోరం-మయన్మార్ సరిహద్దుల్లో పట్టుబడింది ప్రాసెస్ చేయని తలనీలాలు. దేశంలో సేకరిస్తున్న తలనీలాల్లో ఆలయాల నుండి వస్తున్నది కేవలం 25 శాతం మాత్రమేనన్న విషయం గుర్తుంచుకోవాలి.
 
ఈ వాస్తవాలేవీ తెలుసుకోకుండానే  మాజీ ఎమ్మెల్యే శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి  టిటిడి ధర్మకర్తల మండలిపై, అధికారులపై నిందారోపణలు చేస్తూ బురద చల్లడం మంచిది కాదని హెచ్చరిస్తున్నాము.
 
టీటీడీ విషయంలో రాజకీయ దురుద్దేశాలతో అవాస్తవ ఆరోపణలు చేసి భక్తుల విశ్వాసం తో  ఆడుకోవద్దని హితవు చెబుతున్నాము. ఈ విషయం పై శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని బేషరతుగా  క్షమాపణలు చెప్పాలి. లేనిపక్షంలో  చట్టప్రకారం  వారిపై సివిల్  మరియు క్రిమినల్  డిఫమేషన్ నోటీసులు పంపడం  జరుగుతుందని హెచ్చరిస్తున్నాం.